మెరుగైన భవితకు.. సీబీఎస్‌ఈ వర్సెస్ స్టేట్ బోర్డ్

మెరుగైన భవితకు.. సీబీఎస్‌ఈ వర్సెస్ స్టేట్ బోర్డ్ - Sakshi


విద్యా బోధనలో అనుసరించే విధానాలే విద్యార్థుల భావి జీవితాన్ని నిర్దేశిస్తాయి. ముఖ్యంగా పాఠశాల స్థాయిలోనే విద్యార్థి భవిష్యత్‌కు పునాది పడుతుంది. కాబట్టి ప్రాథమిక స్థాయిలోనే సీబీఎస్‌ఈ సిలబస్ స్కూల్లోనా లేదా స్టేట్ సిలబస్ పాఠశాలలో చేర్పించాలా? అనే ప్రశ్న తల్లిదండ్రులకు ఎదురవుతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. ఒకటి నుంచి 12వ తరగతి వరకు జాతీయస్థాయిలో బోధన మార్గనిర్దేశకాలు రూపొందించే సంస్థ.



స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్.. రాష్ట్రాల స్థాయిలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలలను పర్యవేక్షించి, బోధన పద్ధతులు అమలు చేసే సంస్థ.  బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్.. పదో తరగతి తర్వాత ఎంతో కీలకమైన ఇంటర్మీడియెట్ విద్యకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రణాళికలు రూపొందించే సంస్థ. ఈ బోర్డుల కరిక్యులం, సిలబస్, టీచింగ్-లెర్నింగ్ దృక్పథాలు కూడా వేర్వేరుగానే ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత అయోమయ పరిస్థితి ఉంది. ఏ బోర్డ్ పాఠశాలలో చదివితే ఎక్కువ నాలెడ్‌‌జ, నైపుణ్యాలు లభిస్తాయి? ఏ సిలబస్ చదివితే భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విజయం సొంతమవుతుంది? అని ఆలోచిస్తుంటారు. ఇప్పటికే ప్రధాన పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలల్లో వచ్చే ఏడాదికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని పాఠశాలలు ప్రవేశ ప్రక్రియను ముగించాయి. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ, స్టేట్ బోర్డ్‌ల సిలబస్‌లు, ప్రయోజనాలు, లోపాలపై

 

నిపుణుల విశ్లేషణ..

 

 

సీబీఎస్‌ఈకి పెద్దపీట

 

 వాస్తవానికి ప్రస్తుతం జాతీయస్థాయిలో సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చదవడానికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. కారణం.. సీబీఎస్‌ఈ సిలబస్, కరిక్యులం ఫ్రేమ్‌వర్క్‌లో అనుసరిస్తున్న వినూత్న విధానాలే. ఫలితంగా తమ పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే చక్కటి నైపుణ్యాలు సొంతమవుతాయనే భావన తల్లిదండ్రుల్లో నెలకొంది.

 

ప్రాథమిక విద్య నుంచే క్రియేటివిటీ

 

సీబీఎస్‌ఈ కరిక్యులంలో ప్రత్యేకత విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే విధంగా పాఠ్యాంశాలు ఉండటమే. ప్రాథమిక విద్యలో ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడం మొదలు పదో తరగతిలో అల్జీబ్రా ఈక్వేషన్స్ వరకూ.. ప్రతి దశలో, ప్రతి పాఠంలో, ప్రతి సబ్జెక్ట్‌లో క్రియేటివ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం లభిస్తోంది. క్రిటికల్ థింకింగ్, కనెక్షన్, కాన్సెప్ట్స్ అనే మూడు ముఖ్య లక్ష్యాల ఆధారంగా సిలబస్ రూపకల్పన జరిగింది. ఉదాహరణకు ప్రాథమిక విద్య దశనే తీసుకుంటే ఆల్ఫాబెట్స్ నేర్పించే క్రమంలో కలరింగ్, పెయింటింగ్ వంటి వాటితో ప్రాక్టికల్ దృక్పథంతో, విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించే విధంగా బోధన సాగుతోంది. ఈ ప్రాక్టికల్ అప్రోచ్ విద్యార్థుల తరగతుల వారీగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో మూడు లేదా నాలుగేళ్ల వయసు నుంచే చదువుపై ఆసక్తి పెరుగుతోంది.

 

యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్

 

యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్.. సీబీఎస్‌ఈ బోధనలో అనుసరించే మరో వినూత్న పద్ధతి. ఒక పాఠ్యాంశాన్ని బోధించే క్రమంలో విద్యార్థులను స్వయంగా భాగస్వాములను చేయడం ద్వారా సదరు అంశంపై థియరీతోపాటు అప్లికేషన్ స్కిల్స్ పెంపొందించడం ఈ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు పర్యావరణం అంశాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. వాయు కాలుష్యంపై అవగాహన కలిగించే క్రమంలో.. విద్యార్థులను నేరుగా ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలకు తీసుకెళ్తారు. అక్కడ వాహనాల ద్వారా వెలువడుతున్న పొగ గాలిలో కలిసి కాలుష్యానికి దారితీస్తున్న పరిస్థితులను వివరిస్తారు. ఇలాంటి వినూత్న విధానాలను ప్రస్తుతం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌లో అమలు చేస్తున్నారు. సోషల్ సెన్సైస్ సబ్జెక్ట్‌లే కాకుండా ప్యూర్ సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లలోనూ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అమలవుతోంది. ఇందుకోసం మ్యాథ్ ల్యాబ్స్, మ్యాథ్ ప్రాక్టీస్ స్కూల్స్, సైన్స్ ల్యాబ్స్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ స్కూల్స్‌ను నిర్దేశించింది. సీబీఎస్‌ఈ పాఠాల్లోని మరో ప్రత్యేకత ఇలస్ట్రేటివ్ మెథడ్స్‌ను అనుసరించడం. అంటే.. ఏదైనా ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి పాఠంలో ఉన్న అంశాన్ని బొమ్మలు, గ్రాఫ్‌లు, టేబుల్స్ రూపంలో బోధించడం. ఫలితంగా విద్యార్థులకు సదరు అంశం గురించి ప్రాక్టికల్‌గా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. నేర్చుకున్న విషయం సుదీర్ఘ కాలం మనస్సులో నిక్షిప్తమవుతుంది.

 

పాఠాల కొనసాగింపు

 

సీబీఎస్‌ఈ విధానంలో విద్యార్థులకు మేలు చేకూర్చుతున్న మరో అంశం.. ఆయా పాఠాల కొనసాగింపు ప్రక్రియను కచ్చితంగా అమలు చేయడం. ఉదాహరణకు.. ఫిజిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఆరో తరగతిలో ఫోర్స్, ప్రెజర్, మోషన్ అనే అంశాలకు కొనసాగింపుగా ఏడు, ఎనిమిది తరగతుల్లో ఐడియాస్ ఆఫ్ ఫోర్స్, ప్రిక్షనల్ ఫోర్స్ వంటి పాఠాలు ఉంటాయి. తద్వారా విద్యార్థులకు పాఠశాల స్థాయి పూర్తి చేసుకునే సమయానికి సదరు అంశంపై అన్ని కోణాల్లో అవగాహన, నైపుణ్యం లభిస్తుంది. బేసిక్స్‌పై పూర్తి స్థాయి పట్టు సాధించడం ద్వారా భవిష్యత్తులో వాటి ఆధారంగా జరిగే పోటీ పరీక్షల్లో ముందుండటానికి వీలు కలుగుతుంది.

 

సమకాలీనంగా సిలబస్

 

ప్రస్తుత ప్రపంచంలో ప్రతి రోజూ కొత్త పరిణామాలు, సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇవి సైన్స్ నుంచి లాంగ్వేజెస్ వరకు అన్ని విభాగాల్లోనూ సర్వసాధారణమయ్యాయి. దాంతో విద్యార్థులకు సమకాలీన అంశాలపై అవగాహన కలిగేలా ఎన్‌సీఈఆర్‌టీ ఎప్పటికప్పుడు సిలబస్‌లో మార్పులు, చేర్పులు చేస్తోంది. కనీసం ప్రతి మూడేళ్లకోసారి సిలబస్‌లోని అంశాల్లో మార్పులు ఖాయంగా ఉంటున్నాయి. ఈ మార్పులు ఒకటో తరగతి నుంచి +2 వరకు ఉండటం గమనించాల్సిన విషయం. దీంతో విద్యార్థులకు చక్కటి జనరల్ నాలెడ్జ్ కూడా సొంతమవుతోంది.

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్

 

ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సీబీఎస్‌ఈ పాఠశాలలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలితీసేందుకు దోహదం చేసేలా చూడటం మరో ప్రత్యేకత. పాఠశాల స్థాయిల్లో నిర్వహించే ఎగ్జిబిషన్స్ వంటివి ఇందుకు చక్కటి ఉదాహరణ. అంతేకాకుండా ఇటీవల కాలంలో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, థియేటర్ ఆర్ట్స్ పేరిట డ్రామాలు, సంగీతం, పెయింటింగ్ వంటి ఇతర అంశాలను చేర్చి వాటిలోనూ విద్యార్థులు పాల్గొనేలా అవకాశం కల్పిస్తున్నారు. ఇవి విద్యార్థుల మానసికోల్లాసం పెంపొందించడానికి దోహదపడుతున్నాయి.

 

హైస్కూల్ స్థాయిలో.. ఇలా

 

హైస్కూల్ స్థాయి అంటే ఆరు నుంచి పదో తరగతి. ఈ స్థాయిలో విద్యార్థుల్లో ఆయా అంశాల పట్ల ఆసక్తి పెంచే క్రమంలో ప్రాక్టికాలిటీకి సీబీఎస్‌ఈ ప్రాధాన్యం ఇస్తోంది. మొత్తం నిర్దేశించిన పీరియడ్ల సంఖ్యలో కనీసం 20 శాతం మేర ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్‌కు కేటాయించే విధంగా పాఠశాలలకు మార్గనిర్దేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించే పలు సైన్స్ ఎగ్జిబిషన్స్, కాంపిటీషన్స్‌లో పాల్గొనేలా, విద్యార్థులను సంసిద్ధులను చేసే విధంగా సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తోంది.

 

వినూత్నంగా 11, 12 తరగతులు.. ఎలక్టివ్ సబ్జెక్ట్స్

 

పదకొండో తరగతి.. రాష్ట్రాల స్థాయిలో దీనినే ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం అంటారు. సహజంగా రాష్ట్రాల స్థాయిలో ఇంటర్మీడియెట్‌లో నిర్దేశిత గ్రూప్‌లు ఉంటాయి. విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న గ్రూప్ ఆధారంగా అందులో పేర్కొన్న సబ్జెక్ట్‌లనే  చదవాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ మాత్రం ఇంటర్మీడియెట్‌కు తత్సమానంగా భావించే పదకొండు, పన్నెండు తరగతుల్లోనూ వినూత్న విధానాలను అమలు చేస్తోంది. మూడు లేదా నాలుగు సబ్జెక్ట్‌లుగా ఉండే గ్రూప్‌ల విధానానికి విభిన్నంగా సబ్జెక్ట్‌లను ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలో పదకొండో తరగతిలో ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్‌ను కంపల్సరీగా.. 30 సబ్జెక్ట్‌ల (మ్యాథమెటిక్స్, సైన్స్, కామర్స్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బయోటెక్నాలజీ, ఫ్యాషన్ స్టడీస్, క్రియేటివ్ రైటింగ్ అండ్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్, మాస్ మీడియా స్టడీస్, నాలెడ్జ్ ట్రాన్సిషన్ అండ్ ప్రాక్టీసెస్ తదితర) ను ఎలక్టివ్స్‌గా పేర్కొంది. విద్యార్థులు ఎలక్టివ్స్‌గా పేర్కొన్న సబ్జెక్ట్‌ల్లో తమకు నచ్చిన నాలుగు సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చు. దీంతో లాంగ్వేజ్‌తో కలిపి ఐదు సబ్జెక్ట్‌లతో పదకొండు, పన్నెండు తరగతులు పూర్తి చేయొచ్చు. అంతేకాకుండా ఆసక్తి ఉంటే నిర్దేశిత ఎలక్టివ్స్ జాబితా నుంచి మరో ఎలక్టివ్‌ను ఆరో సబ్జెక్ట్‌గా కూడా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దాంతో విద్యార్థులకు సీనియర్ సెకండరీ స్థాయి నుంచే మల్టీ డిసిప్లినరీ దృక్పథం అలవడుతోంది. ఉదాహరణకు మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్ట్‌లను; మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ, ఫిజికల్ సైన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్ట్‌లను ఎలక్టివ్స్‌గా ఎంచుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. +2 అర్హతగా నిర్వహించే జాతీయస్థాయి పోటీ పరీక్షలు, వాటి నిబంధనలను దృష్టిలో పెట్టుకుని చాలామంది విద్యార్థులు మ్యాథమెటిక్స్/ఫిజికల్ సెన్సైస్ సబ్జెక్ట్‌లు తమ ఎలక్టివ్స్‌లో ఉండే విధంగా చూస్తున్నారు.

 

బట్టీ చదువులకు స్వస్తి పలికే సీసీఈ

 

 విద్యార్థుల నైపుణ్యాన్ని మూల్యాంకన చేసే విధానంలోనూ సీబీఎస్‌ఈ వైవిధ్యంగా వ్యవహరిస్తోంది. ఇందుకోసం నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్(2011) సూచన మేరకు కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్(సీసీఈ) అనే విధానానికి శ్రీకారం చుట్టింది. అంటే.. విద్యార్థుల నైపుణ్యాలను కేవలం ప్రశ్నలు-సమాధానాల రూపంలోనే మూల్యాంకన చేయకుండా.. అనునిత్యం వారి ప్రతిభను గుర్తించే విధంగా పలు పద్ధతులను అనుసరిస్తోంది. ఈ క్రమంలో క్లాస్ రూం పెర్ఫార్మెన్స్, రైటింగ్ స్కిల్స్, పార్టిసిపేషన్ ఇన్ ప్రాజెక్ట్ వర్క్, స్లిప్ టెస్ట్ వంటి ఎన్నో విధానాలను అమలు చేస్తోంది. దీంతో విద్యార్థులు బట్టీ చదువులకు స్వస్తి పలికి.. నిరంతరం ఆయా అంశాలకు సంబంధించిన క్లాస్‌రూం యాక్టివిటీస్‌లో పాల్పంచుకోవడం ద్వారా ప్రాక్టికల్, థియరీ నాలెడ్జ్ సొంతం చేసుకునే ఆస్కారం లభిస్తోంది.

 

ఫార్మేటివ్.. సమ్మేటివ్

 

కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్‌లో భాగంగా సీబీఎస్‌ఈ కొత్తగా రూపొందించిన విధానాలు ఫార్మేటివ్ అసెస్‌మెంట్, సమ్మేటివ్ అసెస్‌మెంట్. ఫార్మేటివ్ అసెస్‌మెంట్ అంటే..  విద్యార్థులు క్లాస్ రూంలో ప్రదర్శిస్తున్న ప్రతిభ ఆధారంగా నిరంతరం మూల్యాంకన చేయడం; సమ్మేటివ్ అసెస్‌మెంట్ అంటే.. నిర్దిష్ట కాల వ్యవధి, పాఠ్యప్రణాళిక సమయం ముగిశాక నిర్వహించే పరీక్షలో మార్కులు ఆధారంగా మూల్యాంకన చేయడం. ఈ సమ్మేటివ్ అసెస్‌మెంట్ ప్రతి తరగతికి ఏటా రెండుసార్లు జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తోంది.

 

సీబీఎస్‌ఈలో సమస్యలు

 

సీబీఎస్‌ఈ విధానంలోనూ విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అవి మౌలిక సదుపాయాలు, నాణ్యమైన టీచర్ల పరంగా ఎదురవుతున్న సమస్యలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనే పరిగణనలోకి తీసుకుంటే.. సీబీఎస్‌ఈ పాఠశాలల సంఖ్య వందల్లోనే. సీబీఎస్‌ఈకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనూ సీబీఎస్‌ఈ పాఠశాలలు ఏర్పాటవుతున్నాయి. కాని వాటిలో నిబంధనల మేరకు బోధన ప్రమాణాలు, సౌకర్యాలు, సదుపాయాలు ఉండటం లేదు. ఇది విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మెట్రో నగరాల్లోని పేరున్న పాఠశాలల విద్యార్థులు మాత్రమే సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా రాణించగలుగుతున్నారు అనేది నిపుణుల అభిప్రాయం.

 

స్టేట్ బోర్డ్ సిలబస్‌లో ఇలా..

 

రాష్ట్ర స్థాయిలో విద్యాబోధనలో ప్రణాళికలు, పర్యవేక్షణ స్టేట్ బోర్డ్‌లు నిర్వహిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పాఠశాల స్థాయి వరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియెట్ కోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌లు ఈ బాధ్యత చేపడుతున్నాయి. సిలబస్, కరిక్యులంను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందిస్తుంది.  

 

సిలబస్‌లు మారుతున్నాయి.. కానీ



 రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే రెండేళ్ల క్రితం నుంచి ఆయా తరగతుల వారీగా హైస్కూల్ స్థాయి సిలబస్‌ను మార్చారు. తాజాగా ఈ సంవత్సరం 2014-15లో పదో తరగతి సిలబస్‌లోనూ మార్పులు చేశారు. ఇవన్నీ కూడా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ ప్రకారం- విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే విధంగా, ప్రాజెక్ట్ ఓరియెంటేషన్, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తోనే ఉన్నాయి. కానీ వాటిని అమలు చేసే విధంగా పాఠశాలల్లో సరైన సదుపాయాలు ఉండట్లేదు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌ల విషయంలో మౌలిక సదుపాయాల సమస్య కొత్త సిలబస్ ఆశించిన లక్ష్యాలను చేరేందుకు అడ్డంకిగా మారుతోంది.

 

అధిక శాతం సీబీఎస్‌ఈ ఆధారితమే

 

స్టేట్ బోర్డ్ సిలబస్ మార్చినా.. అది అధిక శాతం అంటే దాదాపు 80 నుంచి 85 శాతం సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగానే ఉండటం గమనార్హం. మిగతా సిలబస్‌లోని అంశాలను స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. జాతీయస్థాయిలో పోటీ పరీక్షలన్నీ సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగానే ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థులను ముందుగానే సంసిద్ధులను చేయడం కోసమే సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా స్టేట్ సిలబస్ రూపొందించారని నిపుణు లు పేర్కొంటున్నారు. అయితే ఆ స్థాయిలో ప్రమాణాలు అందుకునే విషయంలో విద్యార్థుల నేపథ్యం కొంత ఇబ్బందులకు దారితీస్తోంది. ముఖ్యంగా గ్రామీణ  విద్యార్థులు కొత్త సిలబస్‌ను ఆకళింపు చేసుకోవడంలో ఆందోళన చెందుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

ఉపాధ్యాయులదే కీలకపాత్ర


 

ప్రస్తుతం ఆరు నుంచి పదో తరగతి వరకు మారిన సిలబస్‌లోని అంశాల్లో అధిక శాతం క్లాస్ రూంలోనే పూర్తి చేయాల్సినవి. సీబీఎస్‌ఈలో మాదిరిగానే అమలు చేస్తున్న కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ అనాలసిస్‌లో భాగంగా విద్యార్థుల్లో ఎంక్వైరీ అప్రోచ్ పెంపొందించేలా చేయడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. ఈ విషయంలో వారే సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త బోధన విధానంపై శిక్షణ ఇవ్వకుండా.. ఇచ్చినా స్వల్ప వ్యవధిలో(రెండు, మూడు రోజుల వ్యవధిలో) ముగించడం వంటి కారణాలతో ఉపాధ్యాయులు కూడా సన్నద్ధత పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు సంబంధించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి బోధన పద్ధతులు అమలు చేయాలనే విషయంలో సందిగ్ధ పరిస్థితికి లోనవుతున్నారు. ఇక సమ్మేటివ్ అసెస్‌మెంట్‌కు సంబంధించి పుస్తకంలో లేని ప్రశ్నలను పరీక్ష పత్రంలో రూపొందించాలని.. తద్వారా విద్యార్థులు అప్పటివరకు పాఠాల్లో నేర్చుకున్న అంశాల ఆధారంగా.. సదరు ప్రశ్నకు సరితూగే అంశాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని సృజనాత్మకంగా సమాధానం ఇచ్చేలా చేయాలని నిర్దేశించారు. దీంతో ఉపాధ్యాయులు ప్రశ్నలను రూపకల్పన చేసేందుకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

 

పరిష్కారం.. ఉపాధ్యాయులకు శిక్షణ


 

తెలుగు రాష్ట్రాల్లో మార్చిన సిలబస్.. లక్షిత ఫలాలు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందాలంటే ముందుగా ఉపాధ్యాయులను సంసిద్ధులను చేయాలి. ఇందుకోసం వారికి శిక్షణ కార్యకలాపాలు నిర్వహించి కొత్త విధానంపై అవగాహన కల్పించాలి. అవసరమైతే బీఈడీ, డీఈడీ స్థాయిలో పెడగాజి సిలబస్‌ను మార్చడం కూడా మేలు చేస్తుంది.

 

ఇంటర్మీడియెట్ సిలబస్.. జాతీయ పోటీని తట్టుకునేలా

 

ఇంటర్మీడియెట్ సిలబస్‌ను రెండేళ్ల క్రితం మార్చారు. దీన్ని కూడా సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా యథాతథంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని అంశాల ఆధారంగా రూపొందించారు. దీనికి కారణం జాతీయస్థాయిలో జరిగే ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్‌ల సిలబస్ సీబీఎస్‌ఈ పాఠ్యాంశాల నుంచే ఉండటమనేది నిపుణుల అభిప్రాయం. సిలబస్‌లో బయలాజికల్ సెన్సైస్‌కు సంబంధించి ఇంకా మెరుగులు దిద్దాలని, తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఎంసెట్‌ను దృష్టిలో పెట్టుకుని జాతీయస్థాయి పరీక్షల్లో వచ్చే అంశాలు కొన్నింటిని విస్మరించారని నిపుణులు అంటున్నారు. దీనివల్ల విద్యార్థులు కొన్ని అంశాలు అదనంగా చదవాల్సి వస్తోంది. ఈ సమస్యను కూడా పరిష్కరిస్తే ఒకే సమయంలో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీ పరీక్షలకు అకడమిక్స్‌తోపాటు సమాంతరంగా ప్రిపరేషన్ సాగించే అవకాశం లభిస్తుంది.

 

మ్యాథమెటిక్స్‌లో మెరుగు



ఇంటర్మీడియెట్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో మ్యాథమెటిక్స్ సిలబస్ సీబీఎస్‌ఈతో పోల్చితే మెరుగ్గా ఉంది. ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ల ఔత్సాహికులకు ఇది కలిసొచ్చే అంశంగా మారుతోంది. కానీ ఇదే సమయంలో ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి మరింత అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో సిలబస్‌ను రూపొందించాల్సిన అవసరముంది. ఇప్పటికీ ఫిజిక్స్, కెమిస్ట్రీల సిలబస్‌ల్లో అప్లికేషన్ ఓరియెంటేషన్ శాతం తక్కువగా ఉంది.

 

సీబీఎస్‌ఈ నుంచి ఐపీఈ దిశగా



రాష్ట్రాల స్థాయిలో చాలా మంది విద్యార్థులు పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో చదివి ఇంటర్మీడియెట్‌కు మాత్రం స్టేట్ బోర్డ్‌లో నమోదు చేసుకుంటున్నారు. ఇలా మారుతున్న వారి శాతం 50 శాతం మేరకు ఉంటోంది.  దీనికి కారణం రాష్ట్రాల స్థాయిలో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్. ఈ ఎంట్రన్స్‌లో సిలబస్, అడిగే ప్రశ్నలు యథాతథంగా ఇంటర్మీడియెట్ సిలబస్ ఆధారంగానే ఉంటున్నాయి. అంతేకాకుండా మెడికల్ కోర్సుల ఔత్సాహికులకు కేవలం ఎంసెట్ మాత్రమే ప్రధాన వేదికగా ఉంటోంది. జిప్‌మర్, ఏఎఫ్‌ఎంసీ వంటి ఇతర జాతీయస్థాయి ఎంట్రన్స్‌లు ఉన్నప్పటికీ.. అందుబాటులోని సీట్ల ఆధారంగా ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ఎంసెట్ మాత్రమే.

 

సీబీఎస్‌ఈ సిలబస్ అనుకూలతలు

 

జాతీయస్థాయి పరీక్షల సంసిద్ధతకు అవకాశం.

అకడమిక్స్‌తోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం.

{పాక్టికల్, అప్లికేషన్ దృక్పథం ఫలితంగా విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి నుంచే క్షేత్ర నైపుణ్యం.

సమకాలీన మార్పులకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు.

ఉపాధ్యాయులకు కూడా నూతన బోధన విధానాలపై శిక్షణ కార్యక్రమాలు.

 

స్టేట్ బోర్డ్ నూతన సిలబస్ అనుకూలతలు

 

విద్యార్థుల్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం.

రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే పరీక్షలకు సంసిద్ధత.

కొశ్చన్ అండ్ ఆన్సర్ విధానానికి స్వస్తి.

సృజనాత్మకతకు ఆస్కారం.

సీబీఎస్‌ఈ సిలబస్‌కు సమాంతరంగా ఉండటంతో జాతీయస్థాయి పరీక్షలకు కూడా సంసిద్ధత.

 

సీబీఎస్‌ఈ.. అంతర్జాతీయ గుర్తింపు



సీబీఎస్‌ఈ సిలబస్, ఎడ్యుకేషన్ విధానానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. దేశంలోనూ దాదాపు అన్ని రాష్ట్రాలు ఇప్పుడు సీబీఎస్‌ఈ సిలబస్ వైపే అడుగులు వేస్తూ కొత్త సిలబస్‌ను రూపొందిస్తున్నాయి. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ నిర్దేశించిన సీసీఈ అమలు కావాలంటే సరైన సదుపాయాలు ఉండాలి. అదే విధంగా ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.

 

 

 - డాక్టర్ సందీప్ పొన్నాల; కరిక్యులం, సిలబస్, టెక్ట్స్‌బుక్స్ నేషనల్ ఫోకస్ గ్రూప్ సభ్యులు

 

 కమ్యూనికేషన్ స్కిల్స్‌కు.. ‘సీబీఎస్‌ఈ’

 

సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ప్రాక్టికల్ అప్రోచ్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అలవడతాయి. దీనివల్ల రాబోయే తరగతుల్లో రాణించడంలో ఇతరులకంటే కొంత ముందుంటారు. అయితే సమస్య సదుపాయాల విషయంలోనే. ఇటీవల కాలంలో పలు సీబీఎస్‌ఈ స్కూల్స్ ఏర్పాటవుతున్నాయి. కానీ సీబీఎస్‌ఈ నిర్దేశిత నమూనాలో బోధన నిర్వహించాలంటే సరైన సదుపాయాలు ఉండాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది.

 - కె. మాథ్యూస్, ప్రిన్సిపాల్, గ్లెండేల్ అకాడమీ

 

 పెడగాజి మారితే.. స్టేట్ సిలబస్‌లోనూ సత్ఫలితాలు

 

స్టేట్ సిలబస్‌లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరుగుతున్నాయి. అన్ని తరగతుల వారు సమగ్ర అభివృద్ధి చెందేలా సిలబస్‌లో అంశాల రూపకల్పన ఉంటోంది. కానీ బోధన పరంగానే సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించినా.. ప్రైవేట్ పాఠశాలల్లో అది జరగట్లేదు. దీంతో కొత్త బోధన పద్ధతులపై అవగాహన సరిగా లేక ఉపాధ్యాయులే ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం పెడగాజిలో మార్పులు తేవడమే. ఇందుకు అవసరమైతే బీఈడీ, డీఈడీ కోర్సుల స్వరూపం మార్చడానికి కూడా వెనుకంజ వేయకూడదు. ఇంటర్మీడియెట్‌లోనూ ఎంపీసీ, బైపీసీకే పరిమితం కాకూడదు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనతో ఎంపీసీ, బైపీసీలవైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఇంటర్మీడియెట్‌లో కూడా వినూత్న కాంబినేషన్లతో కూడిన సబ్జెక్ట్‌లు ఎంపిక చేసుకునేలా ఉంటే విద్యార్థులకు మరింత ప్రయోజనం.

 - ప్రొఫెసర్ ఎన్.ఉపేందర్ రెడ్డి, హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరిక్యులం అండ్ టెక్ట్స్‌బుక్స్ అండ్ అసెస్‌మెంట్, టీజీఎస్‌సీఈఆర్‌టీ

 

థింకింగ్, ఇన్నోవేషన్‌ను పెంచేలా సీబీఎస్‌ఈ

 

సీబీఎస్‌ఈ సిలబస్ విద్యార్థుల్లో థింకింగ్, ఇన్నోవేషన్ నాలెడ్జ్‌ను పెంచే విధంగా ఉంటోంది. అడ్మిషన్ నుంచి ఎవాల్యుయేషన్ వరకు విభిన్న పద్ధతులు అనుసరిస్తోంది. అంతేకాకుండా జాతీయస్థాయిలో పరీక్షలకు సంసిద్ధత కూడా లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఆసక్తి కలిగే విధంగా బోధన జరుగుతుంది. సీబీఎస్‌ఈలో సైన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం, మ్యాథ్స్‌కు తక్కువ ప్రాధాన్యం. ఈ కారణంగానే  చాలామంది పదో తరగతి తర్వాత స్టేట్ బోర్డ్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకుంటున్నారనడం సరికాదు. ఏ సబ్జెక్ట్ అయినా.. ఏ సిలబస్ అయినా అన్ని అంశాలు కవర్ అవుతాయి. అయితే వాటిని పొందుపర్చిన తరగతి విషయంలోనే తేడా. ఉదాహరణకు మ్యాథమెటిక్స్‌లోని సమితులు చాప్టర్‌ను తీసుకుంటే స్టేట్ బోర్డ్‌లో తొమ్మిదో తరగతిలోనే ఉంటుంది. సీబీఎస్‌ఈలో పదో తరగతిలో ఉంటుంది. అదే తేడా. కానీ పూర్తిగా ఒక సబ్జెక్ట్‌లోని ఒక అంశాన్ని విస్మరించడం అనేది ఏ సిలబస్‌లోనూ జరగదు. విద్యార్థులు కేవలం ఎంపీసీ, బైపీసీ అనే ఆలోచనలకే పరిమితం కాకుండా కొత్త గ్రూప్‌లపై దృష్టి సారించాలి. ఈ అవకాశం ఇప్పుడు సీబీఎస్‌ఈ విధానంలో ఎంతో ఎక్కువగా ఉంది.   

 - సీతామూర్తి, ప్రిన్సిపాల్, సిల్వర్ ఓక్స్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top