సీఏ, సీఎస్, సీఎంఏ.. ప్రాక్టికల్ ట్రైనింగ్.. పరిపూర్ణతకు మార్గం

సీఏ, సీఎస్, సీఎంఏ.. ప్రాక్టికల్ ట్రైనింగ్.. పరిపూర్ణతకు మార్గం


చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ); కంపెనీ సెక్రటరీ (సీఎస్); కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్ (సీఎంఏ).. కామర్స్ రంగంలో దశాబ్దాలుగా ఆదరణ పొందుతున్న ప్రొఫెషనల్ కోర్సులు. నేటి పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్ యుగంలో వీటికి మరింత డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు వీటి విషయంలో ఎదురవుతున్న సమస్య... నైపుణ్య లేమి.  ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన నియంత్రణ సంస్థలు ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యమిచ్చాయి.



మరే ఇతర కోర్సుల్లో లేని విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేశాయి. క్షేత్ర నైపుణ్యాలు పెంపొందించుకోవడం కరిక్యులంలో భాగం చేశాయి. ఈ నేపథ్యంలో సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై ఫోకస్..


 

సీఏ.. ఆర్టికల్‌షిప్‌కు అత్యంత ప్రాధాన్యం

చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను ఆర్టికల్‌షిప్‌గా పేర్కొంటున్నారు. కోర్సు నియంత్రణ సంస్థ ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్‌‌డ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆర్టికల్‌షిప్‌నకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నిబంధనలు అమలు చేస్తోంది. మూడేళ్ల ఆర్టికల్‌షిప్ పూర్తి చేసినవారిని మాత్రమే కోర్సు ఫైనల్ పరీక్షల్లో హాజరుకు అనుమతిస్తోంది. సీఏ విద్యార్థులు కోర్సు రెండో దశ ఐపీసీసీలో పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచే గుర్తింపు పొందిన ఆడిటర్ లేదా ఆడిట్ సంస్థ వద్ద ఆర్టికల్ ట్రైనింగ్‌లో అడుగుపెట్టాలి.



విద్యార్థులు తాము థియరిటికల్‌గా చదువుతున్న అంశాలను అప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా అన్వయించే నైపుణ్యాలు సొంతం చేసుకునేలా చేయడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం. ఫలితంగా ఫైనల్ సర్టిఫికెట్ చేతికందేనాటికి విద్యార్థికి ఒక పూర్తిస్థాయి సీఏకు అవసరమైన అన్ని నైపుణ్యాలు లభిస్తాయి. ఆర్టికల్‌షిప్ సమయంలో ట్రైనీకి నిర్ణీత మొత్తంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అదే విధంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా సెలవులు ఇవ్వాలని కూడా ఐసీఏఐ స్పష్టం చేసింది.

 

సమస్యలివే

ట్రైనీలు తమ ఆర్టికల్‌షిప్ సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమను సదరు సంస్థ లేదా సర్టిఫైడ్ ఆడిటర్ అన్ని విభాగాల్లో పాల్పంచుకోనీయడం లేదని, దీనివల్ల అన్ని అంశాలపై అవగాహన లభించట్లేదని ట్రైనీలు అంటున్నారు. అంతేకాకుండా సీఏ పరీక్షల ప్రిపరేషన్ కోణంలో ఐసీఏఐ నిర్దేశించిన విధంగా సెలవుల మంజూరు కూడా ఉండట్లేదని చెబుతున్నారు. దీనికి ప్రిన్సిపల్ ఆడిటర్స్ స్పందిస్తున్న తీరు భిన్నంగా ఉంటోంది. ఆర్టికల్ ట్రైనీలు ఒక సంస్థలోని అన్ని కార్యకలాపాల్లో పాల్పంచుకోవాలనే విషయంలో ఆ సంస్థ లేదా ఆడిటర్ దృక్పథం ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు.

 

క్లయింట్లు ఎక్కువగా ఉన్న సంస్థలో ఆడిటర్ తమ క్లయింట్లకు త్వరగా సేవలందించాలనే లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి సంస్థల్లో ఆర్టికల్ ట్రైనీలకు అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితి ఉండదు. కాబట్టి అభ్యర్థులే సహజ చొరవతో పరిశీలన నైపుణ్యాలను పెంచుకుని సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. సెలవుల మంజూరు కూడా సంస్థ లేదా ఆడిటర్‌పైనే ఆధార పడి ఉంటుంది.



‘చిన్న సంస్థల్లో సిబ్బంది తక్కువగా ఉంటారు. అలాంటి వారు విధుల పరంగా ఆర్టికల్ ట్రైనీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతోవారికి సెలవులు మంజూరు చేయడంలో కొంత సమస్య ఎదురవుతోంది’ అంటున్నారు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆడిట్ సంస్థ నిర్వాహకులు. ఆర్టికల్‌షిప్‌తోపాటు అదనంగా..

 

నిర్దేశించిన ఆర్టికల్‌షిప్ పూర్తయిన తర్వాత మూడు నెలలపాటు జనరల్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్(జీఎంటీ) కూడా చేయాలి. అకౌంటింగ్ నైపుణ్యాలతోపాటు నిర్వహణ పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఐసీఏఐ ఈ జీఎంటీకి రూపకల్పన చేసింది. కానీ.. చాలామంది విద్యార్థులు సిలబస్ విస్తృతంగా ఉండే సీఏ కోర్సు పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిస్తున్నారు. థియరిటికల్ ప్రిపరేషన్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తూ డమ్మీ ఆర్టికల్స్‌ను అన్వేషిస్తున్నారనే అభిప్రాయముంది. తప్పనిసరిగా ప్రత్యక్షంగా ఆర్టికల్‌షిప్ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టికల్స్, థియరీ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగితే ప్రాక్టికల్ నైపుణ్యాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఆర్టికల్‌షిప్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం ఐసీఏఐను సంప్రదించవచ్చు.

 

సీఎంఏలోనూ మూడున్నరేళ్లు..

కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ).. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా  నిర్వహించే కోర్సు. మారిన నిబంధనలతో సర్వీసెస్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్ల అవసరం ఏర్పడింది. ప్రధానంగా ఉత్పత్తి సంస్థల్లో కాస్ట్ అకౌంటెంట్ల డిమాండ్ ఎక్కువ. సీఏంఏ కోర్సు నిర్వహణ సంస్థ ఐసీఎంఏఐ విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది. సీఏ మాదిరిగానే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేసింది. అయితే సీఎంఏ కోర్సు విషయంలో విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా కొంత వెసులుబాటు ఉంది.



సీఏలో మాదిరిగా మూడేళ్లు ఆర్టికల్ చేస్తేనే ఫైనల్ పరీక్షకు అర్హత అనే నిబంధన సీఎంఏలో లేదు. కోర్సు రెండోదశగా పేర్కొనే ఇంటర్మీడియెట్ తర్వాత ఆరు నెలలు తొలి దశ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుంటే.. ఫైనల్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. తర్వాత ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక తప్పనిసరిగా మూడేళ్లపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. అప్పుడే సంస్థ నుంచి స్టూడెంట్‌షిప్ లభిస్తుంది. అంతేకాకుండా సీఎంఏ విద్యార్థులకు ప్రాక్టికల్  ట్రైనింగ్‌కు సీఏతో పోల్చితే ఎక్కువ మార్గాలు ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం. కేవలం ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ల వద్దే కాకుండా సంస్థల్లోనూ ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకునే వీలుంది.

 

సీఎంఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ విషయంలో విద్యార్థులు పేర్కొంటున్న సమస్యలు.. అన్ని విభాగాలపై అవగాహన కల్పించకపోవడం, పరీక్షలకు సెలవులు ఇవ్వకపోవడం. అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఏదో ఒక విభాగంలో వారిని నియమిస్తోంది. దాంతో అన్ని అంశాలపై అవగాహన లభించడం లేదు. విద్యార్థులు చొరవగా ఆయా విభాగాల్లోని వారితో మాట్లాడం ద్వారా అక్కడి పనితీరును తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

సీఎస్.. ట్రైనింగ్ తప్పనిసరి.. కానీ..

కంపెనీ సెక్రటరీ కోర్సు... ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా మూడు దశలుగా నిర్వహించే ఈ కోర్సులోనూ ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి. ప్రస్తుతం ఫౌండేషన్ కోర్సు, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే మూడు దశలుగా సీఎస్ కోర్సు స్వరూపం ఉంది. తాజా నిబంధనల ప్రకారం- ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా ఫౌండేషన్ కోర్సు నుంచే దీన్ని ప్రారంభించొచ్చు. ఫౌండేషన్ కోర్సు నుంచి మూడేళ్లు; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ తర్వాత రెండేళ్లు; ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఒక ఏడాది ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్‌షిప్) పూర్తి చేయాల్సి ఉంటుంది.



ఈ తాజా మార్పు విషయంలోనే ఈ రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ తుది దశ అయిన ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఏడాది వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేస్తే చాలు అనే వెసులుబాటు కారణంగా.. అత్యధిక శాతం మంది అభ్యర్థులు ప్రాక్టికల్స్‌కు అత్యల్ప ప్రాధాన్యమిస్తారని అంటున్నారు. ముందుగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా వ్యవహరిస్తారని పర్యవసానంగా క్షేత్ర నైపుణ్యాలు కొరవడతాయని చెబుతున్నారు.



ఇది భవిష్యత్ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి  ఔత్సాహికులు వెసులుబాట్లు గురించి అన్వేషించకుండా.. క్షేత్ర నైపుణ్యాలు పెంచుకునే విధంగా వీలైనంత ఎక్కువ సమయం ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు కేటాయించాలి. అప్పుడే తాము అకడమిక్‌గా చదువుకున్న అంశాలకు సంబంధించి రియల్‌టైం అప్లికేషన్స్‌పై అవగాహన ఏర్పడుతుంది. కంపెనీల చట్టం, ఇతర న్యాయ పరమైన సబ్జెక్ట్‌ల ప్రాధాన్యం ఎక్కువగా ఉండే సీఎస్‌లో పరిపూర్ణత లభించాలంటే ప్రాక్టికల్ అప్రోచ్‌కు పెద్దపీట వేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్‌షిప్) విషయంలో వ్యక్తిగతంగానైనా చొరవ చూపి ముందుకు సాగాలి. అప్పుడే కోర్సులో చేరిన లక్ష్యం నెరవేరడంతోపాటు సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది.

 

ప్రొఫెషనల్‌గా రూపొందాలంటే..


ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్ సెట్‌ల అవసరం సీఏ, సీఎంఏ, సీఎస్ కెరీర్‌కు చాలా ఎక్కువ. కారణం.. తాము చదివిన అంశాలను తక్షణమే అన్వయించాల్సిన విధంగా విధులు ఉంటాయి. దాంతో ఈ రంగంలో మంచి ప్రొఫెషనల్‌గా పేరు గడించాలంటే తప్పనిసరిగా ప్రాక్టికల్ అప్రోచ్ పెంపొందించుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత గురించి ఆందోళన చెందకుండా అకడమిక్ సిలబస్ ప్రిపరేషన్ సాగిస్తూనే ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో వాటిని అన్వయించే నైపుణ్యాలు పెంచుకుంటే సర్టిఫికెట్ సొంతం చేసుకోవడం ఎంతో సులభం.

 

చేయూతనిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు..

సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా విద్యార్థులకు సదరు నిర్వహణ ఇన్‌స్టిట్యూట్‌లు చేయూతనిస్తున్నాయి. ట్రైనింగ్ మార్గాలు అన్వేషిస్తున్న అభ్యర్థులకు సహకరిస్తున్నాయి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల చాప్టర్లను సంప్రదిస్తే ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు అవకాశం కల్పిస్తున్న సంస్థలు, ప్రాక్టీసింగ్ ఆడిటర్స్/సెక్రటరీస్ సమాచారం తెలియజేస్తున్నాయి. పోస్టల్ కోచింగ్ ద్వారా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు; నాన్-మెట్రోస్‌లోని విద్యార్థులకు ఈ సదుపాయం ఎంతో మేలు చేస్తోంది.

 

ప్రాక్టికల్ థింకింగ్ ఉంటేనే...

సీఏ కెరీర్‌లో అడుగుపెట్టే విద్యార్థులు ముందుగా తమలో ప్రాక్టికల్ థింకింగ్ లెవెల్స్‌పై స్పష్టతకు రావాలి. ఎందుకంటే.. సీఏ కోర్సులో ప్రాక్టికాలిటీ ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ రంగంలోని సీనియర్లను, సంస్థలను, ప్రాక్టీసింగ్ సీఏలను సంప్రదించి తమ అవగాహన స్థాయి తెలుసుకోవాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఆర్టికల్ షిప్) విషయానికొస్తే.. పకడ్బందీ అన్వేషణ సాగించాలి. సదరు సంస్థ లేదా ఆడిటర్‌కు ఉన్న గుర్తింపు, క్లయింట్ల సంఖ్య-స్థాయి ఆధారంగా ఆర్టికల్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆర్టికల్‌షిప్ సమయంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకునే కోణంలో కృషి చేస్తే పరిపూర్ణ అవగాహన లభిస్తుంది. ‘పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిద్దాం. తర్వాత విధుల్లో చేరి ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు’ అనే ఆలోచన సరికాదు.

- ఎం.దేవరాజ రెడ్డి, చైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్,ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా

 

సీఎంఏ.. క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం

సీఎంఏ కోర్సు విషయంలో క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. అందుకే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేశాం. ఇదే సమయంలో విద్యార్థుల కోణంలోనూ ఆలోచించి వెసులుబాటు కల్పించాం. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వీలైనంత వరకు ఫైనల్ పరీక్ష నాటికి అధిక శాతం ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాటు చేశాం. కాబట్టి ఒకటిరెండు సంఘటనలు చూసి ఆందోళన చెందకుండా.. నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి.

- ఎ.ఎస్. దుర్గా ప్రసాద్, చైర్మన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా

 

నిరంతర అవగాహనతోనే సీఎస్‌లో రాణింపు

సీఎస్ కోర్సులో రాణించాలంటే నిరంతర అవగాహనే ప్రధానం. ఇందుకు సాధనం ప్రాక్టికల్ ట్రైనింగ్(అప్రెంటీస్‌షిప్). దీని విషయంలో ప్రస్తుతం పలు వెసులుబాట్లు ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు వాటి గురించి పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే విధంగా అడుగులు వేయాలి. ముఖ్యంగా లీగల్ నాలెడ్జ్ ఆవశ్యకత ఎక్కువగా ఉండే సీఎస్ కోర్సులో రియల్‌టైం ఎక్స్‌పోజర్ ఎంతో అవసరం. దీన్ని గుర్తించి ఎగ్జిక్యూటివ్ దశ నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రారంభించడం మంచిది.

- డి. వాసుదేవరావు, చైర్మన్, ఐసీఎస్‌ఐ-హైదరాబాద్ చాప్టర్

 

ఎడ్యూ ఇన్ఫో



విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఏఐసీటీఈ చర్యలు

భారతదేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్‌లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా ఏఐసీటీఈ చర్యలు తీసుకుంటోంది. ఉన్నత విద్యను అంతర్జాతీయీకరణ చేయాలనే ఉద్దేశంతోపాటు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇన్‌స్టిట్యూట్‌లలో సాంస్కృతిక వైవిధ్యం కూడా పెరుగుతుందని, ఫలితంగా మన విద్యార్థులు భవిష్యత్తులో విదేశాల్లోనూ రాణించేందుకు ఆస్కారం లభిస్తుందని ఏఐసీటీఈ వర్గాలు పేర్కొంటున్నాయి.



ఈ క్రమంలో భారత్‌లో చదవాలనుకుంటున్న ఔత్సాహిక విదేశీ విద్యార్థుల కోసం అమెరికాలో నిర్వహిస్తున్న స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేసే దిశగా ఏఐసీటీఈ వేగంగా అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి భారత్‌కు ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థుల సంఖ్య 2013 నాటికి 1.3 లక్షలు ఉండగా ప్రతి ఏటా వస్తున్న సంఖ్యను పరిగణిస్తే అది 15 శాతంలోపే ఉంటోంది. తాజాగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top