ఖరారైన స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థుల మార్పు
హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెస్ విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో మూడు స్థానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మలిజాబితాలో ఈ మేరకు పేర్కొన్నారు. రాయచోటి, విజయవాడ వెస్ట్, రామచంద్రాపురం అభ్యర్థులను మార్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ మారడంతో విజయవాడ వెస్ట్ ఆకుల శ్రీనివాస్కు కేటాయించారు.
రామచంద్రాపురంలో జి.సూర్యనారాయణ స్థానంలో జాన్ విక్టర్బాబును పోటీకి దించారు. రాయచోటి సీటును షేక్ ఫజిల్ బదులు షేక్ అజ్మతుల్లాకు కేటాయించారు. ఇంకా నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. చిత్తూరు, మచిలీపట్నం, అనంతపురం, కడప లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది.