టీడీపీకి షాక్
బొబ్బిలి, న్యూస్లైన్: బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెంటు లక్ష్మునాయుడుకు సొంత కుటుంబం నుంచే షాక్ తగిలింది. లక్ష్ము నాయుడుకి స్వయాన బాబాయి తెంటు బెనర్జీనాయుడు బుధవారం టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు బెనర్జీకి పార్టీ కండువా వేసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ తరఫున అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న బొబ్బిలి రాజులకు తన సంపూర్ణమైన మద్దతునిస్తున్నట్లు తెలిపారు. ప్రచారంలో తాను కూడా పాల్గొని అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. వైఎస్ వలన ఎన్నో కుటుంబాలు బాగు పడ్డాయన్నారు. ప్రజలంతా వైఎస్ను దేవుడిగా కొలుస్తున్నారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి అయి తీరుతారని అన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే బొబ్బిలి రాజులను గెలిపించుకోవాలని కోరారు. బెనర్జీ పార్టీలో చేరడంతో తమకు మరింత బలం చేకూరిందంటూ సుజయ్, బేబీ నాయనలు సంతోషం వ్యక్తం చేశారు.