'బీజేపీతో పొత్తుకు వెళ్లనని..ఇప్పుడు చేతులు కలిపాడు'

'బీజేపీతో పొత్తుకు వెళ్లనని..ఇప్పుడు చేతులు కలిపాడు' - Sakshi


ఖమ్మం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ నేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. బీజేపీతో జీవితంలో పొత్తు పెట్టుకోనని చెప్పిన చంద్రబాబు..తిరిగి ఆ పార్టీతో పొత్తుకు వెళ్లడాన్ని షర్మిల తీవ్రంగా దుయ్యబట్టారు. జిల్లాలోని కూసుమంచి ఎన్నికల రోడ్ షోలో ప్రసంగించిన ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ.. చంద్రబాబు గారి వాగ్దానాల్లో కాని, ఆయన మాటల్లో కానీ నిజం లేదనడానికి తాజాగా ఆయన బీజేపీతో పొత్తుకు వెళ్లడమే నిదర్శమని విమర్శించారు. గతంలో ఆయన బీజేపీతో ఎప్పుడూ పొత్తుపెట్టుకోనని ఘంటా భజాయించీ మరీ చెప్పి, ఇప్పుడు అదే బీజేపీతో చేతులు కలపడం ఏమిటని షర్మిల ప్రశ్నించారు.


 


ఇప్పుడు ఇస్తున్న వాగ్దానాలన్నీ నాడు చంద్రబాబు ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇప్పుడు మళ్లీ మాయమాటలతో ఎన్నికలకు వస్తున్నాడు.. ఇప్పుడు ఆల్‌ ఫ్రీ అంటూ ప్రచారం నిర్వహిస్తూ కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నాడన్నారు. ఆనాడు మంచితనంతో టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఆయన్ను పిలిచి అల్లుణ్ని చేసుకుంటే.. ఆయన కుర్చీకే ఎసరు తెచ్చిన ఘనుడు చంద్రబాబు అనే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఆఖరికి ఆయనపై చెప్పులు వేయించడానికి కూడా చంద్రబాబు వెనుకాడలేదని షర్మిల మరోమారు గుర్తు చేశారు. మన రక్తం పంచుకునే పిల్లలకు మన గుండెల్లో చోటిస్తామని..అటువంటిది మరణించి ఐదేళ్లు అయినా ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారన్నారు. దానికి కారణం ఆయన ప్రజలకు సువర్ణమైన పాలన అందించి చరిత్రలో నిలిచిపోవడమేనని షర్మిల తెలిపారు.


 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top