ఈ అభ్యర్థుల ఆస్తులు వందల కోట్లు

ఈ అభ్యర్థుల ఆస్తులు వందల కోట్లు


 నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ :నరసాపురం పార్లమెంటరీ స్థానంలో నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల ముగ్గురి ఆస్తులు వంద కోట్ల పైమాటే. బీజేపీ, టీడీపీ తరుపున నామినేషన్లు దాఖలు చేసిన కనుమూరి రఘురామకృష్ణంరాజు, బీజేపీ అభ్యర్థి గోకరాజు రంగరాజు తమ ఆస్తుల విలువను గురువారం వెల్లడించారు. వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంక రవీంద్రనాథ్ బుధవారమే ఆస్తుల వివరాలు వెల్లడించిన విషయం విదితమే. ఈ ముగ్గురు అభ్యర్థుల ఆస్తులు వందలకోట్లు పైబడి ఉండడం విశేషం. ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు తన భార్య రమాదేవితో కలిపి మొత్తం రూ.772,04,25,085 విలువైన స్థిర చరాస్తులు ఉన్నట్టు 40 పేజీల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రఘురామకృష్ణం రాజు పేరుపై రూ.480,85,37,199, ఆయన భార్య పేరుపై రూ.291,18,87,882 విలువైన ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. తాను స్వయంగా సంపాదించిన ఆస్తులు రూ. 332 కోట్లుగా తెలిపారు. వివిధ బ్యాంకుల్లో రఘురామకృష్ణంరాజుకు రూ.57,23,20,000, ఆయన భార్యకు రూ.14,88,85,000 మొత్తంగా రూ.72,12,05,000 అప్పులు ఉన్నట్టు చూపించారు.

 

 గోకరాజు ఆస్తి రూ.297 కోట్లు

 బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేసిన గోకరాజు గంగరాజుకు, ఆయన భార్య లైలాకు కలిపి రూ. 297,46,66,294 ఆస్తులు ఉన్నట్టు రిటర్నింగ్ అధికారికి సమర్పించిన 38 పేజీల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రంగరాజుకు రూ.237,73,35,820 స్థిరచరాస్తులు, ఆయన భార్యకు రూ.59,73,30,474 స్థిర చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. వాటిలో ఆయనకు రూ.192 కోట్ల విలువైన వ్యాపార సంస్థలు, భూములు, నివాస భవనాలు, వాహనాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన భార్యకు రూ.29.15 కోట్లు విలువైన నివాస భవనాలు, భూములు ఉన్నట్టు వివరించారు. రంగరాజుకు రూ.10,57,42,600, ఆయన భార్యకు రూ. 6,27,58,686 మొత్తం రూ.16.85 కోట్ల అప్పులు చూపించారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top