సగం పెళ్లి ఉండదు: జవదేకర్
సాక్షి, న్యూఢిల్లీ: పొత్తు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఆడుతున్న డ్రామాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. తాజా పరిణామాలపై గురువారం పార్టీ నేత ప్రకాశ్ జవదేకర్ స్పందిస్తూ ‘అయితే పెళ్లి.. లేకుంటే ఏమీ లేదు. అంతేకానీ సగం పెళ్లి అంటూ ఏమీ ఉండదు’ అని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి పొత్తు ఉంటే ఇరు రాష్ట్రాల్లోనూ ఉంటుందని, లేదంటే ఎక్కడా ఉండదని తేల్చిచెప్పడానికి బీజేపీ సిద్ధపడినట్టు నేతలు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా, సీమాంధ్రలో ఒంటరిగా బరిలోకి దిగడానికి కూడా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సంకేతాలు పంపినట్టు సమాచారం. బీజేపీ నుంచి ఎవరుండాలో చంద్రబాబే నిర్ణయిస్తే ఇక తమ పార్టీ ఎందుకని ఒక సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. పురందేశ్వరికి సీటు కేటాయించవద్దని బీజేపీపై బాబు ఒత్తిడి చేయడమేంటని ప్రశ్నించారు.