రోజు కుదిరింది..జోరు అదిరింది


సాక్షి, కాకినాడ :జిల్లావ్యాప్తంగా బుధవారం మూడు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ముహూర్తం మంచిదన్న నమ్మకమే ఇందుకు ప్రధాన కారణం. రాజమండ్రి లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్‌అభ్యర్థిగా బొడ్డు వెంకటరమణ చౌదరి రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11.12 గంటలకు నామినేషన్ వేశారు. ద్వారకా తిరుమలలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన నేరుగా రాజమండ్రి ఆనం కళాకేంద్రం సెంటర్‌కు చేరు కున్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి సిటీ, రూరల్ అభ్యర్థులు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు బాబిరెడ్డి, రాష్ర్ట సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, జక్కంపూడి రాజాలతో పాటు వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో నగర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కందుల దుర్గేష్ కూడా నామినేషన్ వేశారు.

 

 టీడీపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్ కూడా బుధవారమే నామినేషన్ వేయాలనుకున్నా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు వెంట ఉండి పోవడంతో వాయిదా వేసుకున్నారు. కాకినాడ లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ఎల్‌బీనగర్‌లోని స్వగృహం నుంచి పార్టీ సీజీసీ సభ్యుడు గంపల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులతో పాటు వేలాదిమంది కార్యకర్తలతో కలిసి నగర వీధుల మీదుగా  కలెక్టరేట్ వరకు ఊరేగింపుగా వచ్చి నామినేషన్ వేశారు. సీపీఐ ఎంఎల్ అభ్యర్థిగా ఏగుపాటి అర్జునరావు, సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) అభ్యర్థిగా జల్లూరి వెంకటేశ్వర్లు, స్వతంత్రులుగా చాగంటి సూర్యనారాయణమూర్తి, మడికి ప్రభాకరరావు నామినేషన్లు వేశారు. అమలాపురం లోక్‌సభ స్థానానికి జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి జీవీ హర్షకుమార్, టీడీపీ నుంచి పండుల రవీంద్రబాబు, కాంగ్రెస్ నుంచి ఏజేవీబీ మహేశ్వరరావు నామినేషన్లు వేశారు.

 

 హోరెత్తిన జగ్గంపేట

 జగ్గంపేట అసెంబ్లీ స్థానం వైఎస్సార్  సీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ ఉద యం 11.09 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ఇర్రిపాకలోని స్వగృహం నుంచి బయల్దేరిన జ్యోలుత కుటుంబ సమేతంగా తొలుత గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి  రేగింపుగా సోమవరం, కృష్ణవరం, బూరుగుపూడి, రామవరంల మీదుగా జగ్గంపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. గ్రామంలోని రావులమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. డమ్మీ అభ్యర్థిగా ఆయన తనయుడు నవీన్‌కుమార్ నామినేషన్ వేశారు. కాగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి సంగీత వెంకట్రావు నామినేషన్ వేశారు.

 

 హోరెత్తిన కాకినాడ వీధులు

 కాకినాడ సిటీ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నామినేషన్ కార్యక్రమం కాకినాడ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. వేలాదిగా పోటెత్తిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నగర వీధులు హోరెత్తిపోయాయి. భాస్కర బిల్డింగ్ నుంచి ఓపెన్‌టాప్ జీపుపై బయల్దేరిన ద్వారంపూడి ఆనందభారతి, మెయిన్‌రోడ్, బాలాజీచెరువు, జెడ్పీ జంక్షన్ల మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా అభ్యర్థులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వైడీ రామారావులతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. కాకినాడ రూరల్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణు మధ్యాహ్నం 12.32 గంటలకు నామినేషన్  వేశారు. గొడారిగుంటలోని స్వగృహం నుంచి భారీ ఊరేగింపుగా తహశీల్దార్ కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. వేణు వెంట కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, అనుబంధ విభాగాల కన్వీనర్లు పంపన రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కర్రి సత్యనారాయణ , గట్టి రవి, ఐ.శ్రీను తదితరులున్నారు. టీడీపీ అభ్యర్థిగా పిల్లి అనంతలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబులతో పాటు మరో ఇద్దరు టీడీపీ అభ్యర్థికి డమ్మీలుగా నామినేషన్లు వేశారు.

 

 ఆలయాల్లో పూజలు, అనంతరం ర్యాలీలు

 రాజమండ్రి సిటీ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బొమ్మన రాజ్‌కుమార్ ఉదయం 11.05 గంటలకు నామినేషన్ వేశారు. దేవీచౌక్‌లో ప్రత్యేక పూజల అనంతరం మెయిన్‌రోడ్డు మీదుగా భారీ ఊరేగింపుతో తహశీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఆయన వెంట ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ అభ్యర్థి ఆకుల వీర్రాజు, అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు గెడ్డం రమణ, గారపాటి ఆనంద్ తదితరులున్నారు. జై సమైక్యాంధ్ర అభ్యర్థి శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, మరో ముగ్గురు స్వతంత్రులు కూడా నామినేషన్లు వేశారు. అనపర్తి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఉదయం 11.12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. గొల్లలమామిడాడ సూర్యనారాయణమూర్తి ఆలయంలో పూజల అనంతరం ఊలపల్లి, పందలపాక, తొస్సిపూడి, కొమరిపాలెం, మహేంద్రవాడ, కుతుకులూరు, రామవరం, కొలమూరుల మీదుగా అనపర్తి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

 

 మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, ఆయిల్‌పామ్ అసోసియేషన్ రాష్ట్రాధ్యక్షుడు, జెడ్పీ మాజీ ప్రతిపక్ష నాయకుడు సత్తి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంటి ముక్తేశ్వరరావు, బీఎస్పీ నుంచి పినిపే వెంకట రామకృష్ణ, స్వతంత్ర అభ్యర్థిగా పడాల సునీత నామినేషన్లు వేశారు. అమలాపురం అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా గొల్ల బాబూరావు మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి స్వగృహం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి హైస్కూల్ సెంటర్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన అనంతరం భారీ ఊరేగింపుగా తహశీల్దార్ కార్యాలయం చేరుకొని నామినేషన్ వేశారు. చిట్టబ్బాయితో పాటు అమలాపురం పార్లమెంటు అభ్యర్థి పినిపే విశ్వరూప్, ఆల్డా రాష్ర్ట చైర్మన్ యాళ్ల దొరబాబు, మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇదే నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా గౌతమ్ నామినేషన్ వేశారు.

 

 కొత్తపేట నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరె డ్డి మధ్యాహ్నం 1.45 గంటలకు నామినేషన్ వేశారు. గోపాలపురంలోని స్వగృహం నుంచి  వేలాది మంది కార్యకర్తలతో రావులపాలెం మీదుగా కొత్తపేట తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ర్ట మహిళా కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు, సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.  టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానందరావు, ఆయన డమ్మీగా ఒకరు, స్వతంత్రునిగా మరొకరు నామినేషన్లు వేశారు. రాజోలు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బొంతు రాజేశ్వరరావు ఉదయం 11.15 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. సఖినేటిపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, పార్టీ నాయకులు కుచ్చెర్లపాటి సూర్యనారాయణ, జక్కంపూడి తాతాజీ తదితరులతో కలిసి రాజోలు తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. పిఠాపురంలో టీడీపీ అభ్యర్థిగా ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, కాంగ్రెస్ నుంచి పంతం ఇందిర నామినేషన్లు వేశారు.

 

 ప్రత్తిపాడు నుంచి స్వతంత్రునిగా ముద్రగడ

 ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నామినేషన్ వేశారు. రామచంద్రపురం నుంచి టీడీపీ, జై సమైక్యాంధ్ర అభ్యర్థులుగాతోట త్రిమూర్తులు, తలాటం వీర్రాఘవులు, మరో ఇద్దరు డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. రాజానగరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అంకం నాగేశ్వరరావు(గోపి), ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. పి.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పులపర్తి నారాయణమూర్తితో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు. జై సమైక్యాంధ్ర అభ్యర్థిగా జీవీ శ్రీరాజ్ నామినేషన్ వేసేందుకు  మధ్యాహ్నం 3.05 గంటలకు ఆర్వో కార్యాలయానికి చేరుకోగా సమయం మించిందని ఆర్వో తిరస్కరించడంతో వెనుదిరిగారు.

 

 ముమ్మిడివరం నుంచి టీడీపీ అభ్యర్థిగా దాట్ల బుచ్చిబాబు నామినేషన్ వేశారు. మండపేట నుంచి టీడీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, పిరమిడ్ పార్టీల తరఫున వరుసగా వేగుళ్ల జోగేశ్వరరావు, కామన ప్రభాకరరావు, వీవీఎస్ రామకృష్ణారావు, మొగ్గా విజయభారతిలతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు. రంపచోడవరం వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ వంతల రాజేశ్వరితో పాటు సీపీఎం అభ్యర్థిగా సింగిరెడ్డి అచ్చారావు, మరో ముగ్గురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి బుధవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాగా గురువారం వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా ముమ్మిడివరం నుంచి గుత్తుల సాయి, మండపేట నుంచి గిరజాల వెంకటస్వామి నాయుడు, ప్రత్తిపాడు నుంచి వరుపుల సుబ్బారావు నామినేషన్లు వేయనున్నారు.

 

 జనసంద్రమైన తుని

 తుని నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా దాడిశెట్టి రాజా మధ్యాహ్నం 2.36 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ఎస్.అన్నవరం వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన భారీ ఊరేగింపు పట్టణంలోని సూరవరం రోడ్, మార్కెట్‌యార్డు, పార్కు సెంటర్, ఆంజనేయస్వామి గుడి, బాలాజీ సెంటర్, మెయిన్‌రోడ్డు, గొల్ల అప్పారావు సెంటర్ల మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు సాగింది. మహిళా విభాగం జిల్లా కన్వీనర్ రొంగలి లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కుసుమంచి శోభారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు లాలం బాబ్జి, మాకినీడి గంగారాం, డీసీసీబీ డెరైక్టర్ పోలిశెట్టి సోమరాజు, టౌన్, రూరల్ కన్వీనర్లు అనిశెట్టి సూర్యచక్రరెడ్డి, గారా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ సీహెచ్ పాండురంగారావు కూడా నామినేషన్ వేశారు. పెద్దాపురం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తోట సుబ్బారావునాయుడు ఉదయం 11గంటలకు నామినేషన్ వేశారు. సామర్లకోట భీమేశ్వరాలయంలో పూజల అనంతరం పెద్దాపురం ముప్పనవారి బంగ్లాకు చేరుకున్న ఆయన వేలాది మంది అభిమానులతో ఊరేగింపుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట ఆప్కో డెరైక్టర్ ముప్పన వీర్రాజు, మహారాణి సత్రం చైర్మన్ కట్టా వీరన్న, గోలి వెంకట్రావు,గోలి వెంకట అప్పారావుచౌదరి, మోరంపూడి శ్రీరంగనాయకులు, కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, నెక్కంటి సాయిప్రసాద్ తదితరులున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్రునిగా గొంప రామకృష్ణ నామినేషన్ వేశారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top