నేరచరిత్రపై పిల్ ను తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు
అభ్యర్థుల నేరచరిత్రను అందరికీ కనిపించేలా పోలింగ్ కేంద్రాల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో ఉంచాలని డిమాండ్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయమూర్తులు ఎస్ కె అగ్నిహోత్రి, ఎం ఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
పెండింగ్ కేసుల వివరాలు, శిక్షపడితే ఆ వివరాలను ప్రభుత్వాఫీసుల్లో, పోలింగ్ కేంద్రాల్లో పెద్ద పెద్ద బోర్డులపై ఉంచాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. అయితే పోలింగ్ బూత్ కి 100 మీటర్ల లోపు ఏ అభ్యర్థికీ వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదన్న ప్రజా ప్రాతినిథ్య చట్టం లోని సెక్షన్ 130 కి ఇది వ్యతిరేకమని ప్రభుత్వం వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ధర్మాసనం కేసును తోసిపుచ్చింది.