కేసీఆర్ గైర్హాజరు.. శ్రేణుల్లో నిరుత్సాహం


సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట చంద్రశేఖర్‌రావు ఇబ్రహీంపట్నం పర్యటన రద్దు కావడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న టీఆర్‌ఎస్‌కు కేసీఆర్ పర్యటన మరింత బలం చేకూర్చుతుందని భావించిన పార్టీ నాయకులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఎన్నికల ప్రచార పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సభ ప్రారంభం కానుండడంతో ఆ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు, స్థానిక నాయకులు పెద్దఎత్తున జనసమీకరణ చేపట్టాలని అనుకున్నా ఆశించిన మేర జనంరాలేదు.



 అఅభిమానుల్లో అసంతృప్తి

 చాలా కాలం తర్వాత కేసీఆర్ ఇబ్రహీంపట్నం వస్తుండన్న ప్రచారంతో అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

 శుక్రవారం భానుడి ప్రతాపం తగ్గడంతో సభకు వచ్చిన వారంతా ఉత్సాహంగా కేసీఆర్ కోసం వేచి చూశారు. అయితే సాయంత్రం ఆరుగంటలు దాటుతున్నప్పటికీ కేసీఆర్ రాకపోవడంతో సభకు హాజరైన అగ్రనేతలు కే.కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి తదితరులు ప్రసంగాలు ప్రారంభించారు. వారి ప్రసంగాలు ముగిసినా కేసీఆర్ రాకపోవడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు ఊసురు మంటూ వెనుదిరిగారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top