కేసీఆర్ ఓ మాయలోడు


ధారూరు, న్యూస్‌లైన్:  తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ రూ. కోట్లు సంపాదించారని, కుటుంబ పాలన కోసం ఉద్యమాన్ని వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి, వికారాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి జి.  ప్రసాద్‌కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండలంలోని కేరెల్లి, కొండాపూర్‌ఖుర్దు, ఎబ్బనూర్, అల్లిపూర్, చింతకుంట, హరిదాస్‌పల్లి, రుద్రారం, గట్టెపల్లి, రాంపూర్‌తడా, దోన్నాల్, నాగారం, తరిగోపుల, మోమిన్‌కలాన్, అంతారం, మోమిన్‌ఖుర్దు, జైదుపల్లి, గోదంగుడ తదితర గ్రామాల్లో ప్రసాద్‌కుమార్ సుడిగాలి పర్యటన చేశారు.



 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో సంపాదించిన డబ్బును వ్యవసాయం చేసి సంపాదిస్తున్నానని కేసీఆర్ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎకరా పొలంలో మిర్చి పండించి రూ. కోటి ఆదాయం వచ్చిందని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎన్నికలైన మరుక్షణమే అమెరికా వెళ్లిపోతారని, ఆయనకు ఇక్కడి ప్రజల సమస్యలు తెలియవని, తెలుగు భాష సరిగా రాని ఆయనకు ఓట్లు అడగడానికి రాదని అన్నారు. రాజకీయ కుటంబం నుంచి వచ్చిన చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు.



 సమావేశంలో కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ధారూరు ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్‌రావు, హరిదాస్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ అంజయ్య, వికారాబాద్, ధారూరు ఏఎంసీ వైస్ చైర్మన్లు పెంటయ్య, బాలునాయక్, జెడ్పీటీసీ అభ్యర్థి పట్లోళ్ల రాములు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జి. లక్ష్మన్, మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి, ఎంఐఎం మండల అధ్యక్షుడు మోయిజ్‌ఖురేషి, సర్పంచులు పాండునాయక్, నర్సిరెడ్డి, ప్రమీలమ్మగౌడ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  



 మద్దతు పలికిన ఏసీఆర్ వర్గం

 ప్రసాద్‌కుమార్‌కు మద్దతుగా మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ వర్గం ప్రచారంలోకి దిగింది. బుధవారం ధారూరు మండలానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రసాద్‌కుమార్‌కు ధారూరు వద్ద ఎస్‌కె ఆశం తన అనుచరులతో కలిసి స్వాగతం పలికారు. ప్రసాద్‌కుమార్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని ఏసీఆర్ వర్గం నాయకులు చెప్పారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top