కేసీఆర్.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పిచ్చాస్పత్రికి పంపిస్తా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరిక
నల్లగొండ: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు నన్ను జైలుకు పంపుతానని అంటున్నావ్.. మరోసారి పిచ్చిమాటలు మాట్లాడితే పిచ్చాస్పత్రికి పంపిస్తా జాగ్రత్త’ అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఆది వారం నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ, బీసీల జపంతో పాటు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావును ప్రధాన లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ‘‘తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని మీరంతా కలలుగన్నారు. ఇప్పుడు కావాల్సింది గడీల పాలన కాదు.. గరీబోళ్ల పాలన’’ అని చెప్పారు. రైతులంతా వ్యవసాయం చేసి అప్పుల పాలవుతుంటే.. కేసీఆర్ ఎకరాలో రూ.కోటి ఆదాయం ఎలా పొందుతున్నాడని, అదంతా బ్లాక్మనీని వైట్మనీగా మార్చే ఎత్తుగడ అని ఆరోపించారు.
తన దగ్గరే ఆయన రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్నాడని చెప్పారు. కార్మికమంత్రిగా ఉండి బీడీ కట్టలపై పుర్రె బొమ్మ వేయించి కార్మికుల పొట్టగొట్టాడని విమర్శించారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. నాదీ, మోడీదీ హిట్ కాంబినేషన్ అని చెబుతూ.. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానని పునరుద్ఘాటించారు. నల్లగొండ జిల్లాలో నలుగురు బీసీలకు టికెట్లు ఇచ్చానని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అవినీతి అనకొండ అని ఆరోపించారు. జిల్లాకు చెందిన మంత్రులు విపరీతంగా సంపాదించారని విమర్శించారు. రైతులెవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దన్నారు. రైతుల రుణాలతో పాటు, డ్వాక్రా మహిళా సంఘాల రుణాలను కూడా మాఫీ చేస్తానన్నారు.