పాలమూరుకు బాకీ ఉన్నా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ‘నేను ఎక్కడ నుంచో వస్తే ఎంపీగా గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని కాపాడారు. పాలమూరు ఎంపీగానే ఉంటూ తెలంగాణ సాధించా. ఈ ఘ నత, గౌరవం తప్పకుండా పాలమూరుకే దక్కుతుంది. అందుకే మహబూబ్నగర్ జిల్లాకు నేను ఎంతో బాకీ పడి వున్నా, మీ రు ణం తీర్చుకోవాలి’ అంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్రావు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం షాద్నగర్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
‘హైదరాబాద్కు షాద్నగర్ అత్యంత సమీపంలో ఉన్నా ఆశించిన ప్రగతి రాలేదు. కృష్ణా నీళ్లు రప్పించేందుకు ఉద్దేశించిన పనులు సగంలోనే ఆగిపోయాయి. వాటిని పూర్తి చేయించే బాధ్యత నాది. కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా పెద్ద ప్రాజెక్టును నిర్మిస్తాం. మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు పశ్చిమ రంగారెడ్డి, హైదరాబాద్కు కూడా నీల్లు అందేలా చూస్తాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.‘జిల్లాలో 670 పెద్ద చెరువులు, నాలుగు వేలకు పైగా చిన్న చెరువులు వున్నాయి. సమైక్య రాష్ట్రంలో చెరువులు, కుంటలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, కుంటలు పునరుద్దరించి మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తాం. జూరాలతో పాటు లక్ష్మీదేవిపల్లిలో నిర్మించే ప్రాజెక్టుల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు పెట్టి మత్స్యకార సొసైటీలకు సరఫరా చేస్తామని’ కేసీఆర్ ఎన్నికల హామీ ఇచ్చారు. ‘కాంగ్రెస్, తెలుగుదేశంతో తెలంగాణకు న్యాయం జరగదు. పాలమూరు జిల్లాకు ఏం చేసినా తక్కువే. కరువు జిల్లా. వలస జిల్లాగా పేరొందిన మహబూబ్నగర్లో 14 ల క్షల ఎకరాలకు సాగునీరు అందించే వరకు నిద్రపోను’ అంటూ కేసీఆర్ ప్రతినపూనారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్రావు ఆర్య అధ్యక్షతన జరిగిన సభలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి ఏపీ జితేందర్రెడ్డి, షాద్నగర్ అసెంబ్లీ అభ్యర్థి అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.