టీడీపీలో హైడ్రామా

గద్దె అనురాధ, రామ్మోహన్ - Sakshi


విజయవాడ: విజయవాడ తూర్పు టీడీపీలో హైడ్రామా నడుస్తోంది. మాజీ ఎంపి, టిడిపి తూర్పు నియోజకవర్గ  బాధ్యుడు  గద్దె రామ్మోహన్‌ పార్టీ బీఫారమ్‌ లేకుండానే విజయవాడ తూర్పు శాసనసభ స్థానానికి తన తరపున భార్య అనూరాధతో నామినేషన్ వేయించారు. ఈ స్థానం కోసం తూర్పు నియోజకవర్గం  సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి  రవి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరుపుతున్నారు.



 గద్దె రామ్మోహన్‌కు ఆ పార్టీ మరోసారి మొండిచెయ్యి చూపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో గన్నవరం శాసనసభ స్థానం టికెట్, ఆ తరువాత విజయవాడ లోక్సభ టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు.  అన్ని అవమానాలను ఎదుర్కొటూ ఆయన అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఈసారి లోక్సభ స్థానం టికెట్ కావాలని నాలుగైదు నెలల క్రితమే బహిరంగంగా ప్రకటనలు గుప్పించారు.  చివరకు విజయవాడ తూర్పు సీటు ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధపడ్డారు. అయితే అది కూడా ఇవ్వడానికి ఇష్టంలేని పార్టీ  ఆయన భార్య అనూరాధను జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసింది. దాంతో ఆమె తెలుగుదేశం పార్టీ తరపున ఉంగుటూరు మండలం నుంచి ప్రాదేశిక సభ్యురాలి(జడ్పిటిసి)గా  పోటీ చేశారు.



ప్రస్తుతం తూర్పు స్థానం కోసం యలమంచిలి రవి చేస్తున్న ప్రయత్నాలు తెలుసుకొని గద్దె రామ్మోహన్ ముందుగానే జాగ్రత్తపడ్డారు. తన భార్య చేత నామినేషన్ వేయించారు. టిడిపి తుది జాబితా విడుదల అయితేగానీ ఈ స్థానం ఎవరికి కేటాయిస్తారో తెలుస్తుంది. ఆ తరువాత కూడా పోటీలో ఎవరు ఉంటారనేది చెప్పలేని పరిస్థితి.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top