ఎన్నికల నిబంధనలకు టీడీపీ పాతర
జిల్లాలో చాలా బలహీనంగా ఉన్న టీడీపీ లేని బలాన్ని చూపించుకోడానికి నానా అవస్థలు పడుతోంది. దీని కోసం ఎన్నికల నిబంధనలు, ప్రజాస్వామ్య విలువలు... ఇలా వేటినీ లెక్క చేయడం లేదు. ఇటీవల నిశిరాత్రి గజపతినగరం నియోజక వర్గం గంట్యాడలో దాడులు చేసి నానా బీభత్సం సృష్టించిన నేతలు. తరువాత ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి భారీ ఎత్తున ప్యాకేజీల ఆశ చూపిస్తూ, మరో పక్క ఎక్కడికక్కడ ఎన్నికల నిబంధనలకు పాతర వేస్తూ తమ కార్యకలాపాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు.
బొబ్బిలి రూరల్, న్యూస్లైన్ : ఎన్నికల నిబంధనలకు తెలుగుదేశం పార్టీ పాతరేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ రామమందిరంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. సోమవారం మండలంలోని ఎ.వెలగవలస గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఎ.వెలగవలస, చిత్రకోటబొడ్డవలస, వెంకటరాయుడిపేట, గోపాలరాయుడిపేట, సీతయ్యపేట, రాజుపేట, కింతలివానిపేట, నారశింహునిపేట, దిబ్బగుడ్డివలస, మెట్టవలస, గొర్లెసీతారాంపురంలలో పార్టీ అభ్యర్థి తెంటు లక్ష్మునాయుడు, ఇతర నాయకులు ప్రచారం నిర్వహించారు. గోపాలరాయుడిపేట పంచాయతీ పరిధి వెంకటరాయుడిపేటలో నిబంధనలకు విరుద్ధంగా రామమందిరంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. తమ పార్టీని గెలవాలంటూ గ్రామస్తులను అభ్యర్థించారు. వాస్తవానికి ఆలయాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడం నేరం. మరి మన అధికారులు టీడీపీ నాయకులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే!