విజయ్కు ఝలక్!
* మోడీతో భేటీ
* ప్రకటనలకు ముసుగు
సినీ నటుడు ఇళయదళపతి విజయ్కు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఝలక్ ఇచ్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీ ఎఫెక్ట్తో విజయ్ ప్రకటనల హోర్డింగ్లు, పోస్టర్లకు ముసుగులు వేసే పనిలో ఎన్నికల యంత్రాంగం నిమగ్నం అయింది. విజయ్కు తమిళనాట అశేష అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ను రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు పిలుస్తున్నా, విజయ్ మాత్రం మౌనంగా వస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతును బహిరంగంగా అన్నాడీఎంకేకు విజయ్ ప్రకటించడంతో ఆయన అభిమానులు జెండా చేత బట్టి ఆ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఎన్నికల అనంతరం నెలకొన్న పరిణామాలు అన్నాడీఎంకేకు విజయ్ను దూరం చేశాయి. సినిమాల షూటింగ్లతో బిజీ బిజీగా ఉన్న విజయ్ ఓ నగల షోరూంకు అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు.
రాజకీయాలతో ఆయనకు సంబంధం లేని దృష్ట్యా, ఆయన చిత్రాల పోస్టర్లు, ఫ్లెక్సీలు, నగల షోరూంకు సంబంధించిన ప్రకటన హోర్డింగ్ల మీద ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టలేదు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం ఆయన నరేంద్ర మోడీని కలుసుకోవడంతో ఆయన ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తొలగించడం, ముసుగులు వేయడంపై ఈసీ దృష్టి కేంద్రీకరించింది.
ముసుగులు
రాష్ట్రంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటుగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. కోయంబత్తూరులో ఆయన్ను విజయ్ కలుసుకున్నారు. ఆయనతో భేటీ అనంతరం కేవలం మర్యాదేనని, ఎలాంటి రాజకీయాలు లేవని విజయ్ స్పష్టం చేశారు. తాను ఎవ్వరికీ మద్దతు ఇవ్వనంటూనే పరోక్షంగా మోడీని ప్రశంసించడం ఈసీ దృష్టికి చేరింది.
విజయ్ అభిమానులు సైతం బీజేపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తుండటాన్ని ఈసీ పరిగణనలోకి తీసుకుంది. ఆయన ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని పరిశీలించిన ఎన్నికల యంత్రాంగం విజయ్కు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధం అయింది. రాష్ర్టంలో ఆయన ప్రకటనల ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, అనేక ప్రాంతాల్లో అభిమానులు ఏర్పాటు చేసుకున్న బోర్డులు, తదితర వాటిని తొలగించడం, ముసుగులు వేయించడం మొదలెట్టారు. కోయంబత్తూరులో అయితే, అత్యధికంగా ఉన్న అన్ని ఫ్లెక్సీలకు ముసుగులు వేయడంతో సంబంధిత షోరూం వర్గాలు, ప్రకటన ఏజెన్సీలు కంగు తిన్నాయి.