బాబు గారి సింగ్‌పూర్

బాబు గారి సింగ్‌పూర్ - Sakshi


హైటెక్ పేరు తో  హైదరాబాద్  గుల్ల చేసిన  చంద్రబాబు


హైదరాబాద్... ఈ పేరెత్తితే చాలు.. చంద్రబాబు పూనకంతో ఊగిపోతారు. టక్కున హైటెక్ మంత్రం అందుకుంటారు. అభివృద్ధికి చిరునామా, అంతర్జాతీయ ఖ్యాతికి కేరాఫ్ తానేనంటూ ఊదర గొడతారు.  మాట్లాడితే మారిషస్... లేదంటే సింగ్‌పూర్, ఈ రెంటి మీది నుంచి ఏమాత్రం దిగరు. ఐటీకి ఆద్యుడినని.. అలియాస్‌నూ  తానేనని అంటారు... అస్తమానం హైటెక్ సిటీ భవనం వైపు వేలు చూపించి... అదే హైదరాబాద్ అభివృద్ధి అంటారు. ‘ఫ్లై ఓవర్’లు ఎక్కేస్తారు.. గాల్లోనే తిరిగేస్తారు. మరి తూట్లు పడ్డ ఫై ఓవర్ల సంగతేమిటంటే... అది మాత్రం నన్నడగొద్దు... అంతా ‘తమ్ముళ్ల’ మాయాజాలం అంటూ తప్పించుకుంటారు. సెల్ ఫోన్ కనిపిస్తే చాలు... ‘తమ్ముళ్లూ! అది నేనే తెచ్చా’నంటూ తెగ బిల్డప్ ఇస్తారు. హైదరాబాద్‌ను నిర్మించిన కులీ కుతుబ్‌షా కూడా అన్నింటా తనకన్నా తక్కువేనంటారు.తొమ్మిదేళ్ల పాలనలో షాయర్ లాంటి షహర్‌ను కుదేలు చేశారు బాబు. ఆల్విన్‌కు అల్విదా చెప్పించారు. ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా దాని ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు.



నష్టాల సాకుతో ప్రభుత్వ పరిశ్రమలను అయినవారికి అప్పగింత పెట్టారు. అత్తరు పరిమళాలతో గుబాళించే నగరాన్ని ‘మూసీ’ కంపుతో మురికిమయం చేశారు. ఇరానీ చాయ్ కమ్మదనంతో తెల్లారే బతుకుల్లో కన్నీళ్లు మిగిల్చారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లను చూపించి అదే అభివృద్ధి అంటూ ఊదరగొట్టారు. గరీబ్ గల్లీలు, బస్తీల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నందనవనాల నిర్మాణం పేరుతో బస్తీలను ఖాళీ చేయించి పేదలను అనాథల్ని చేశారు. క్లింటన్‌కు ఎర్రతివాచీ పరిచి, రాత్రికి రాత్రే బిచ్చ గాళ్లను తరిమించి ఆకలితో చంపేశారు. హైదరాబాద్‌ను పేద, మధ్య తరగతి ప్రజలు లేని మార్కెట్‌గా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చార్ సౌ సాల్ షహర్ చరిత్రకు చరమగీతం పాడారు...

 

ఇవన్నీ వదిలేసి... నవ్విపోదురుగాక నాకేటి సిగ్గంటూ మళ్లీ అధికారమిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటున్నారు. సీమాంధ్రను సింగపూర్‌లా మార్చేస్తానంటున్నారు.

 

హైటెక్ పేరుతో హైదరాబాద్‌ను గుల్ల చేసిన చంద్రబాబు

 

1. అభివృద్ధి పేర అడుగడుగునా విధ్వంసం

2.  మొదట బాబు లీకులు.. ఆపై బినామీ ‘జయభేరి’ కారుచౌక కొనుగోళ్లు

3.  ‘సెలెక్టెడ్ ఏరియా డెవలప్‌మెంట్’తో సొమ్ము చేసుకున్న బాబు బినామీలు

4.   ఫ్లై ఓవర్ల పేరుతో అనుయాయులకు నిర్మాణ కాంట్రాక్టులు

5.    భూ సేకరణ పేరుతో భారీ దందా.. బావమరిది బాలకృష్ణ, ఆయన భార్య వసుంధరలతో కారుచౌకగా నానక్‌రామ్‌గూడలో భూముల కొనుగోళ్లు

6.    సీడీఏ పరిధి నుంచి కొండాపూర్‌కు మినహాయింపు.. భార్య భువనేశ్వరి, బినామీ సంస్థ జయభేరి, బంధుమిత్రుల కోసమేనంటూ విమర్శలు

7.    ఎల్‌అండ్‌టీకి సైబర్ టవర్స్ .. గిఫ్ట్‌గా బాబుకు ఎన్టీఆర్ భవన్  

8.   గుక్కెడు తాగునీటికి కూడా దూరమైన నగర వాసులు

9.   ఐటీ అభివృద్ధంటూ జనం కళ్లకు గంతలు.. తొమ్మిదేళ్లలో సైబర్ టవర్‌‌స కూడా దాటని ఐటీ రంగం.. ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరిగిన నిరుద్యోగులు

10    పరిశ్రమల మూసివేతతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలు ఆల్విన్‌తో పాటు అనేక సంస్థలకు బాబు హయాంలోనే మంగళం

11  మూసీని మురుగు కూపంగా మార్చేసిన ఘనుడు.. పరిశ్రమలకు విచ్చలవిడి అనుమతులు.. విషతుల్యమైన కాలుష్యంతో పెను ముప్పు

12.    పాతబస్తీ గోసను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు

13.    కరెంటు బిల్లులు కట్టకుంటే నేరుగా జైలుకే

14    రోగుల నుంచి కూడా యూజర్ చార్జీలు వసూలు

15.    బిచ్చగాళ్లనూ నగరం నుంచి తరిమేసిన హైటెక్ పాలన

 

 ఐటీ.. ‘టవర్‌‌స’ దాటితే ఒట్టు




 ఐటీ.. అంటే అదేదో తనే సృష్టించినట్టు.. ప్రపంచంలో ఎక్కడా లేనట్టు.. పోజులు కొట్టే చంద్రబాబు హయాంలో నిజానికి ఐటీ అభివృద్ధి శూన్యం. సైబర్ టవర్స్ నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో తొలుత అందులోకి వచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు సైతం తర్వాత సైబర్ టవర్స్‌కు టాటా చెప్పేశాయి. బాబుగారు ఇంత గొప్పగా చెప్పుకునే ఐటీ వల్ల అప్పట్లో వచ్చిన ఉద్యోగాలు ఐదువేలేనంటే నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం. ఇక ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఐటీ అభివృద్ధి సైబర్‌టవర్స్ గడపదాటితే ఒట్టు.

 

 జలాసురుడు..




 ఒకనాడు గోల్కొండ కోటకు తాగునీరు అందించిన దుర్గం చెరువు.... నేడు చిన్న తటాకాన్ని తలపి స్తుంది.. 200 ఎకరాల విస్తీర్ణం నుంచి 80 ఎకరాలకు కుదించుకుపోయింది. ఇదొక్కటే కాదు....1995 నుంచి 2004 మధ్యకాలంలో యథేచ్ఛ ఆక్రమణలతో చెరువులన్నీ సహజ స్వరూపాన్ని కోల్పోగా, దాదాపు 104 చెరువులు పూర్తిగా మాయమైపోయాయి... ఇవి హెచ్‌ఎండీఏ అధికారి సర్వేలో వెల్లడైన వాస్తవాలు. చంద్రబాబు జమానాలో హైదరాబాద్‌లో నిరాటంకంగా సాగిన జలవనరుల విధ్వంసాలకు శిథిల సాక్ష్యాలు.

 

 విధ్వంసకారుడు..



 హైటెక్ సిటీ నిర్మాణం కోసం పురాతన శిలలు ముక్కలైపోయాయి. తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్‌లో జరిగిన చారిత్రక విధ్వంసం అంతా ఇంతా కాదు. మస్కతి డెయిరీకి ప్రాచీన మల్వాల ప్యాలెస్ ధారాదత్తమైపోయింది. అందమైన ముష్క్ మహల్ నామరూపాల్లేకుండా పోయింది.. ఇలాంటివెన్నో. చరిత్రలో గుర్తుండిపోయే ఈ చారిత్రక విషాదానికి మౌన సాక్షి హైదరాబాద్ నగరం. వారసత్వ కట్టడాలపై విరుచుకుపడిన ఆ ముష్కరులు ఆంగ్లేయులు కారు.. తాలిబన్లు అంతకన్నా కాదు. ఈ దండయాత్రకు నాయకత్వం వహించిన సేనాని చంద్రబాబే.

 

 ఫ్లై ఓవర్‌‌స.. ఫర్ కాంట్రాక్టర్‌‌స



 ఫ్లై ఓవర్లు అనగానే నగర ప్రజలు తెగ సంతోష పడిపోయారు. ట్రాఫిక్ కష్టాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని మురిసిపోయారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. అగ్గిపెట్టెల్లాంటి ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ కష్టాలు తీరకపోగా ట్రా‘ఫికర్’ మరింత పెరిగింది. ఆరు లేన్లతో నిర్మించాల్సిన వాటిని అడ్డగోలుగా నిర్మించి ప్రజల కష్టాలను రెట్టింపు చేశారు. భవిష్యత్ అవసరాలు తీర్చాల్సిన ఇవి ప్రస్తుత అవసరాలకే పనికిరాకుండా పోయాయి. అయితే బాబును నమ్ముకున్న కాంట్రాక్టర్లు మాత్రం బాగా లాభపడ్డారు.

 

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top