జేబులో 500.. ఓ డొక్కు జీపు!!

జేబులో 500.. ఓ డొక్కు జీపు!! - Sakshi


''నా జేబులో కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎన్నికల్లో ఖర్చుపెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు. ఈ డొక్కు జీపులోనే వెళ్లి నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను'' ఈమాటలన్నది ఎవరో తెలుసా.. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని వారణాసిలో ఢీకొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. వారణాసిలో బుధవారం జరిగిన ఓ రోడ్షోలో ఆయన మాట్లాడారు. తాను ఈ డొక్కు జీపులో తిరుగుతుంటే మోడీ మాత్రం హెలికాప్టర్లోనే తిరుగుతున్నారని, రేపు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి కూడా ఆయన హెలికాప్టర్లోనే వస్తారని కేజ్రీవాల్ చెప్పారు.



వారణాసి వాసులు జాగ్రత్తగా ఉండాలని, రేపు ఎన్నికలు అయిన తర్వాత మోడీ గెలిచినా.. ఆయనను కేవలం హెలికాప్టర్లో మాత్రమే చూసుకోగలరని హెచ్చరించారు. తన రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల ప్రచారానికి వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతారని, తాను మాత్రం అంతంత పెట్టలేనని ఆయన అన్నారు. వారణాసి లోకసభకు మే 12న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ తరపున నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ పడుతున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top