మెయిన్స్‌లో మెరవాలంటే..

మెయిన్స్‌లో మెరవాలంటే..


 దేశంలో అత్యున్నత సర్వీసుల్లో అడుగుపెట్టేందుకు వీలుకల్పించే సివిల్స్-2015 ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 23న  జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా 4 లక్షల మందికిపైగా హాజరయ్యారు. ఇప్పుడు వీరి దృష్టంతామెయిన్స్‌కు అర్హత సాధించేందుకు కటాఫ్‌ఎంత? మెయిన్‌‌సకు ఎలా సిద్ధమవ్వాలి? అనేవాటిపై ఉంటుంది. ఈ క్రమంలో ప్రిలిమ్స్ విశ్లేషణతో పాటు మెయిన్స్‌కు సన్నద్ధతపై నిపుణుల సూచనలు...

 

 4,65,882: దేశ వ్యాప్తంగా ప్రిలిమ్స్‌కు హాజరైన అభ్యర్థులు.

 38,295: తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన అభ్యర్థులు. తెలంగాణ రాష్ట్రం నుంచి 23,788; ఆంధ్రప్రదేశ్ నుంచి 14,507 మంది పరీక్ష రాశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి మొత్తం 24 సర్వీసుల్లో 1,129 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ సివిల్స్-2015 పరీక్ష నిర్వహిస్తోంది. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ప్రిలిమ్స్‌కు 50 శాతం కంటే తక్కువ మంది హాజరయ్యారు. రెండో పేపర్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - సీశాట్)ను అర్హత పరీక్షగా పేర్కొనడంతో హాజరు శాతం పెరుగుతుందని భావించినా.. సాధారణ పరిస్థితే కనిపించింది. ఖాళీల సంఖ్యతో పోల్చుకుంటే ఒక్కో ఉద్యోగానికి దాదాపు 410 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

 

 తేలిగ్గానే ఉంది.. కానీ..

 గత అయిదారేళ్లతో పోల్చుకుంటే ఈసారి సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్ పరీక్ష తేలిగ్గా ఉంది. అయితే కాన్సెప్టులపై స్పష్టత, సబ్జెక్టుపై లోతైన అవగాహన ఉన్న అభ్యర్థులు మాత్రమే సమాధానమివ్వగలిగేలా ప్రశ్నలున్నాయి. కొన్ని ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదవాల్సి వచ్చిందని అభ్యర్థులు తెలిపారు. అధిక ప్రశ్నలు ఫ్యాక్ట్ బేస్డ్‌గా ఉన్న నేపథ్యంలో సబ్జెక్టుపై పూర్తిస్థాయి పట్టున్న అభ్యర్థులకు మాత్రమే మెయిన్స్‌కు అర్హత లభించే అవకాశం ఉంది.

 

 పెరిగిన స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు:

 సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఈసారి స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఇలాంటివి 56 ప్రశ్నలు వచ్చాయి. ఇవి సులభంగానే ఉన్నా.. సంబంధిత అంశంపై పూర్తిస్థాయి అవగాహన ఉంటేనే సమాధానం గుర్తించడం సాధమవుతుంది. కొన్ని ప్రశ్నలు అభ్యర్థులను తికమకకు గురిచేసేలా ఉన్నాయి. ఈ తరహా ప్రశ్నల విషయంలో అభ్యర్థులు పొరపాటు చేసే ఆస్కారముంది.

 

 ఎకాలజీ, జాగ్రఫీలకు పెరిగిన ప్రాధాన్యం:

 గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జాగ్రఫీ, ఎకాలజీ విభాగాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ రెండింటికి సంబంధించి 30 ప్రశ్నలు వచ్చాయి. జాగ్రఫీలో కోర్ అంశాలపై నైపుణ్యాలు పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉన్నాయి.  ఎకానమీ విభాగంలో 20 నుంచి 22 ప్రశ్నలు వచ్చాయి. వీటిలో 19 ప్రశ్నలు కోర్ ఎకానమీకి సంబంధించినవి. మిగిలిన ప్రశ్నలు పాలిటీతో సంబంధమున్న ఆర్థిక అంశాల నుంచి వచ్చాయి. హిస్టరీ నుంచి 15 ప్రశ్నలు అడిగినప్పటికీ.. సంస్కృతి, వారసత్వం అంశాలకు సంబంధించిన ప్రశ్నలు లేకపోవడం గమనార్హం. అన్నీ కోర్ అంశాల నుంచి నేరుగా వచ్చినవే. ఈ విభాగంలోనూ స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు అడగటంతో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారు. పది ప్రశ్నలకు ఓ సాధారణ అభ్యర్థి సమాధానాలు గుర్తించవచ్చు.పాలిటీ నుంచి 13 నుంచి 15 ప్రశ్నలు వచ్చాయి. కొన్ని ప్రశ్నలు ఎకానమీతో సంబంధమున్న పరిపాలనా పరమైన అంశాల నుంచి ఉన్నాయి. పాలిటీలో సాధారణ అభ్యర్థి 7 ప్రశ్నలకు సమాధానం గుర్తించొచ్చు.

 

 జీకే, కరెంట్ అఫైర్స్:

 ఈసారి ప్రిలిమ్స్ పరీక్షలో జనరల్‌నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు వెయిటేజీ పెంచారు. ఈ విభాగాల నుంచి 12 ప్రశ్నలు వచ్చాయి. కరెంట్ అఫైర్స్ నుంచి అడిగిన ప్రశ్నలు సివిల్స్ స్థాయిలో లేవని నిపుణులు అభిప్రాయపడ్డారు.

 

 కటాఫ్ 110:

 ప్రిలిమ్స్‌లో 200 మార్కులకు నిర్వహించిన జనరల్ స్టడీస్ పేపర్లో మెయిన్స్‌కు కటాఫ్ 110-115 మార్కుల మధ్యలో ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. ఈ మార్కులు సాధించిన అభ్యర్థులు మలిదశ మెయిన్స్‌కు సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు. గతేడాది ప్రిలిమ్స్‌లో రెండో పేపర్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో 400 మార్కులకు 205 మార్కులు పొందిన అభ్యర్థులు మెయిన్స్ రాసేందుకు అర్హత సాధించారు.

 

 పేపర్-2 అర్హత పరీక్ష:

 సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2 (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్)ను అర్హత పరీక్షగా పేర్కొన్నప్పటికీ.. యూపీఎస్‌స్సీ నిర్దేశించిన 33 శాతం కనీస అర్హత మార్కులు పొందడం కొంత కష్టమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగం నుంచి ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 23 ప్యాసేజ్‌లు ఇచ్చారు. దీంతో అభ్యర్థులు వాటిని చదివి సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టింది. మ్యాథమెటిక్స్, రీజనింగ్ సంబంధిత ప్రశ్నలు కూడా క్లిష్టంగానే ఉన్నాయి. ఎక్కువ సమయం వెచ్చిస్తే కానీ వీటికి సమాధానాలు గుర్తించలేం.

 

 మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిన 25 ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఆయా అంశాలపై స్పష్టత ఉంటేనే వాటికి సమాధానం గుర్తించడం సాధ్యమవుతుంది. నాన్-మ్యాథ్స్ అభ్యర్థులకు ఇది క్లిష్టమైన విభాగంగా మారింది. రీజనింగ్ విభాగం నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి. మొత్తంమీద ఈ పేపర్‌లో మూడు విభాగాల నుంచి అడిగిన 80 ప్రశ్నలకు సగటు విద్యార్థి 40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించొచ్చు.

 

 సబ్జెక్టుల వారీగా వచ్చిన ప్రశ్నలు:

 సబ్జెక్టు    {పశ్నలు

 హిస్టరీ    15

 ఎకానమీ    20-22

 పాలిటీ    13-15

 జాగ్రఫీ    16

 ఎస్ అండ్ టీ    9

 ఎకాలజీ    14

 జీకే అండ్ కరెంట్ అఫైర్స్    10

 

 మెయిన్స్‌కు సన్నద్ధత

 అభ్యర్థులకు ప్రిలిమ్స్‌లో తాము సాధించగలిగే మార్కుల విషయంలో స్పష్టత వచ్చింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్స్‌కు సన్నద్ధం కావాలి.జనరల్ ఎస్సే కోసం సమకాలీన అంశాలను పరిశీలించి, వాటిని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. నిరంతరం రాయటాన్ని ప్రాక్టీస్ చేయడం ఎంతో అవసరం. ప్రతి అంశంపైనా నిర్దిష్ట అభిప్రాయం వ్యక్తంచేయగల నైపుణ్యాన్ని సాధించాలి. దీనికోసం దినపత్రికల్లోని ఎడిటోరియళ్లు, ఇతర ముఖ్య వ్యాసాలు చదవాలి. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలపై దృష్టిసారించాలి.హిస్టరీకి సంబంధించి ప్రాచీన భారత చరిత్ర నుంచి ఆధునిక భారత చరిత్ర వరకు అన్ని అంశాలు ముఖ్యమైనవి. చరిత్రలో ముఖ్య పరిణామాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి (ఉదాహరణకు మధ్యయుగ చరిత్రలోని పానిపట్ యుద్ధాలు; ఆధునిక చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం, పంచశీల ఒప్పందం తదితర అంశాలు).ఎకనామిక్స్‌లో కోర్ అంశాలు మొదలు ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న తాజా పరిణామాల వరకు (ఆర్థిక సిద్ధాంతాలు మొదలు నుంచి తాజా ఆర్థిక సర్వేలో పేర్కొన్న అంశాల వరకు) అన్నిటిపై అవగాహన పెంపొందించుకోవాలి.

 

 విస్తృతంగా ఉండే జాగ్రఫీ సబ్జెక్టుకు సంబంధించి లోతైన అధ్యయనం అవసరం. ఈ సబ్జెక్టును కేవలం కోర్ సబ్జెక్ట్‌గానే భావించకుండా.. పర్యావరణ పరిస్థితులకు అన్వయించుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి.జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఇదే తరహా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన పేపరు ఎథిక్స్ అండ్ ఇంటెగ్రిటీ. దీనికి నిర్దిష్ట పుస్తకాలు, సిలబస్ అందుబాటులో లేనప్పటికీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లోని కొన్ని సిద్ధాంతాలు ఈ విభాగంలో రాణించేందుకు ఉపకరిస్తాయి. ఈ విభాగంలో రాణించాలంటే.. స్వీయ విశ్లేషణ, నిర్ణయాత్మక సామర్థ్యాలు అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రిపరేషన్ కొనసాగించాలి.అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టుపై పట్టు సాధించడం ముఖ్యం. దొరికిన మెటీరియల్ అంతా చదవడం అనవసరం. సిలబస్ మొత్తం నిక్షిప్తమైన రెండు లేదా మూడు ప్రామాణిక పుస్తకాలను రిఫరెన్సుకు ఉపయోగించుకోవాలి.

 

 నోట్స్ రూపొందించుకోవాలి

 వివిధ సబ్జెక్టుల్లోని ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. సొంతగా ఎస్సే రైటింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. వీలైతే వాటిని నిపుణులతో మూల్యాంకనం చేయించుకోవాలి.పదాల పరిమితి విషయంలో ఆందోళన చెందకుండా ఒక అంశానికి సంబంధించి ముఖ్యమైన పరిణామాలన్నీ పొందుపరిచే విధంగా ఎస్సే రాయటం ప్రాక్టీస్ చేయాలి. దీనికి పరీక్షలో అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

 

 భావ వ్యక్తీకరణ ముఖ్యం

 మెయిన్స్‌లో విజయం సాధించాలంటే భావ వ్యక్తీకరణ ప్రధానం. అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రిపరేషన్ కొనసాగించాలి. జనరల్ ఎస్సే అయినా, సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలకైనా సమాధానాల ప్రజంటేషన్ బాగుండాలి. సూటిగా, స్పష్టంగా రాసే నైపుణ్యం పెంపొందించుకోవాలి. వివిధ అంశాలను పూర్తిగా చదివి, ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఎస్సేలను తిరిగి రాస్తుండాలి. ఎథిక్స్ పేపర్ విషయంలో ప్రిపరేషన్ విభిన్నంగా ఉండాలి. పాలనా దక్షత, నిజాయతీని తమ సమాధానాల్లో ప్రతిబింబించే విధంగా సిద్ధమవాలి. సమకాలీన సామాజిక సమస్యలు, వాటికి సంబంధించి పరిపాలన పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలించడం ఉపయోగకరం.

 - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్,

 ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.

 

 సమతుల్యత కనిపించిన ప్రిలిమ్స్ పేపర్

 ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రిలిమ్స్ పేపర్‌లో అన్ని విభాగాల మధ్య సమతుల్యత కనిపించింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అభ్యర్థులు కూడా సంతృప్తిగానే ఉన్నారు. ప్రశ్నల్లో అధిక శాతం స్టేట్‌మెంట్, ప్యాసేజ్, ఛాయిస్ ఆధారంగా ఉండటం వల్ల కొంత తికమకకు గురైనా, కాన్సెప్టుల పరంగా స్పష్టత ఉన్నవారు తేలిగ్గానే కటాఫ్ మార్కు అందుకోగలరు.

 - శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్.

 

 తార్కిక నైపుణ్యాన్ని విశ్లేషించేలా పేపర్-2

 సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2 (సీశాట్)లో ప్రధానంగా అభ్యర్థుల్లోని తార్కిక ఆలోచనా నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. ఇది ప్యాసేజ్ ఆధారిత, రీజనింగ్ ప్రశ్నల్లో ప్రస్ఫుటమైంది. ఇంగ్లిష్ విభాగంలో మెజారిటీ ప్రశ్నలు ప్యాసేజ్ ఆధారితంగా ఉండటం నాన్-ఇంగ్లిష్ విద్యార్థులను కొంత ఇబ్బందికి గురిచేసిందని చెప్పొచ్చు.

 - రాజేశ్ సరాఫ్,

 సీశాట్ కోర్స్ డెరైక్టర్, టైమ్ ఇన్‌స్టిట్యూట్

 

 తక్షణమే మెయిన్‌‌సకు..

 ప్రిలిమ్స్ రాసిన తర్వాత అభ్యర్థులు చేసే పొరపాటు మెయిన్స్ ప్రిపరేషన్‌కు అధిక విరామం తీసుకోవడం. ఇది సరికాదు. కటాఫ్ రేంజ్‌లో ఉన్న అభ్యర్థులు రెండు మూడు రోజుల కంటే ఎక్కువ విరామం తీసుకోకుండా.. మెయిన్స్ ప్రిపరేషన్‌కు సన్నద్ధమవ్వాలి. ప్రిలిమ్స్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే జనరల్ స్టడీస్‌కు ఎక్కువ సమయం వెచ్చించి ఉంటారు. కాబట్టి ప్రస్తుతం ముందుగా ఆప్షనల్ సబ్జెక్ట్‌పై దృష్టిపెట్టాలి. సెప్టెంబరు నెలాఖరుకు ఆప్షనల్ సబెక్టును పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎథిక్స్ పేపర్‌కు కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. మొత్తంగా అక్టోబరు మొదటి వారంలోగా ఆప్షనల్ సబ్జెక్టు, ఎథిక్స్ పేపర్ ప్రిపరేషన్ పూర్తిచేసుకుని, ఆ తర్వాత మళ్లీ జీఎస్‌పై దృష్టిసారించాలి.

 - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్,

 బ్రెయిన్ ట్రీ అకాడమీ.

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top