పరిశోధన, బోధన.. ‘నెట్’తో సాకారం

పరిశోధన, బోధన.. ‘నెట్’తో సాకారం

 పరిశోధన, బోధన.. ‘నెట్’తో సాకారం సబ్జెక్టులో పరిశోధన చేయాలనే తపన... విశ్వ విద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యాపక వృత్తిలో కెరీర్‌ను కొనసాగించాలనుకునే లక్ష్యం ఉన్న వారికి సాధారణ విద్యార్హతలతో పాటు... నిర్దేశించిన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ నేపథ్యంలో  యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ -నెట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. నెట్ విధానం, సన్నద్ధమయ్యేందుకు ప్రణాళిక వ్యూహాల పూర్తి వివరాలు. 

 

 95 సబ్జెక్టులకు నెట్:

 ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష -నెట్‌కు యూజీసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈసారి పొలిటికల్ సైన్‌‌స, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాపులేన్ స్టడీస్, జాగ్రఫీ, కంప్యూటర్ సైన్‌‌స అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సెన్సైస్ వంటి 95 సబ్జెక్టులలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నెట్‌ను నిర్వహిస్తుంది. ఇందులో అర్హత సాధించి అగ్రస్థానంలో నిలిచిన వారికి పరిశోధన దిశగా ప్రోత్సహించేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్)ను ప్రదానం చేస్తారు. జేఆర్‌ఎఫ్ కటాఫ్‌కు దిగువన ఉన్నవారు యూజీసీ నిబంధంన ప్రకారం లెక్చరర్‌షిప్‌నకు అర్హులవుతారు. మన రాష్ట్రం విషయానికి వస్తే... ఎక్కువ మంది విద్యార్థులు తెలుగుతో పాటు చరిత్ర, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం, సోషియాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులలో నెట్‌కు హాజరవుతున్నారు. 

 

 డిస్క్రిప్టివ్ నుంచి ఆబ్జెక్టివ్‌కు:

 నెట్‌కు సంబంధించి మూడు పేపర్లు ఉంటాయి. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. అంతకుముందు డిస్క్రిప్టివ్ రూపంలో ఉన్న పేపర్-2,3లను 2012 జూన్ నుంచి ఆబ్జెక్టివ్ పద్ధతిలోకి మార్చారు. మూడు పేపర్లకు ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం పేపర్-1,2లు, మధ్యాహ్నం పేపర్-3 ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది. 

 

 సెషన్ పేపర్ మార్కులు {పశ్నలు సమయం 

 మొదటి 1 100 60 ఉ.9.30-10.45

 మొదటి 2 100 50 ఉ.10.46-12.00

 రెండో 3 150 75 మ.1.30-4.00

 

 పేపర్-1

 పేపర్-1 అన్ని సబ్జెక్ట్‌ల విద్యార్థులకు ఒకేలా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ఇందులోని మొత్తం 60 ప్రశ్నల్లో 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. 50 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన పక్షంలో మొదట గుర్తించిన 50 ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మార్కులను కేటాయిస్తారు. పేపర్-1లో బోధనా సామర్థ్యం (టీచింగ్ ఆప్టిట్యూడ్), ఉన్నత విద్యా వ్యవస్థ, పర్యావరణం, భావ ప్రసారం (కమ్యూనికేషన్), లాజికల్ రీజనింగ్ (తార్కిక సామర్థ్యం), విశ్లేషణ శక్తి, గ్రహణశక్తి (కాంప్రెహెన్షన్) నైపుణ్యాలు, డేటా ఇంటర్ ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై సమకాలీన అంశాల మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సిలబస్ పరిధి విస్తృతంగా ఉంటుంది. 

 

 పేపర్-2, 3:

 అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు ఆధారంగానే ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. ఈ ప్రశ్నపత్రం కూడా అభ్యర్థి ఆప్షన్ సబ్జెక్టు ఆధారంగానే ఉంటుంది. సబ్జెక్ట్‌పై లోతైన అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది.  పేపర్ 2, 3లలో అడిగే ప్రశ్నల స్వభావం క్లిష్టంగా ఉంటుంది. వాటి పరిధి ఎక్కువ. కాబట్టి అభ్యర్థులు అకడమిక్ పరంగా లోతైన కోణంలో సాధన సాగించాలి. ఒక్కో అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నప్పుడే సంబంధిత అంశంపై మోడల్ పేపర్లను సాధన చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. ఇలా మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే అవగాహనతోపాటు వేగంగా సమాధానాన్ని గుర్తించే నైపుణ్యం అలవడుతుంది.

 

 అవగాహన అవసరం:

 సిలబస్ పరిధి ఎక్కువ అందువల్ల ముందుగా సిలబస్‌పై ఒక అవగాహనకు రావడం మంచిది. ఆబ్జెక్టివ్ విధానం కావడం వల్ల అన్ని అంశాల నుంచి ప్రశ్నలు రావచ్చు. ఈ నేపథ్యంలో ఏ అంశాన్నీ విడిచి పెట్టకుండా విస్తృత స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్‌ను విశ్లేషణాత్మకంగా సాగిస్తేనే ఎంతటి కష్టమైన ప్రశ్నకైనా సమాధానం గుర్తించవచ్చు. ప్రిపరేషన్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్రమాన్ని అనుసరించాలి.

 అర్హత మార్కులు:

 ప్రతి పేపర్‌లో నిర్దేశించిన అర్హత మార్కులు ఇలా ఉన్నాయి. 

 

 కేటగిరీ పేపర్-1 పేపర్-2 పేపర్-3

 జనరల్ 40 40 75

 ఓబీసీ, ఎస్సీ, 

 ఎస్టీ, పీడబ్ల్యూడీ 35 35 60

 

 తుది జాబితా:

 అభ్యర్థులు నిర్దేశించిన అర్హత మార్కులు సాధించినప్పటికీ మోడరేషన్ కమిటీ నిర్ధారించే కటాఫ్ మార్కుల ఆధారంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జె.ఆర్.ఎఫ్), లెక్చరర్‌షిప్‌ను ప్రదానం చేస్తారు. అందుబాటులో ఉన్న జేఆర్‌ఎఫ్‌ల సంఖ్యను, అభ్యర్థుల ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుని తుది కటాఫ్‌ను నిర్ణయిస్తారు. యూజీసీ రెండు రకాల మెరిట్ లిస్ట్‌లను రూపొందిస్తుంది. మొదట్ లిస్ట్‌లో లెక్చరర్‌షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రెంటికీ అర్హత సాధించిన అభ్యర్థులకు చోటు కల్పిస్తారు. రెండో లిస్ట్‌లో కేవలం లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించిన వారి పేర్లు మాత్రమే ఉంటాయి. 

 

 నెట్‌లో ఎంపికైతే:

 నెట్‌లో క్వాలిఫై కావడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో తత్సమాన ఇన్‌స్టిట్యూట్‌లలో లెక్చరర్,అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్ క్వాలిఫై అయి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల పాటు ఫెలోషిప్ లభిస్తుంది.

 ఐఐటి, ఐఐఎస్‌సీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి నెట్ లేదా జేఆర్‌ఎఫ్‌గల వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

 

 నోటిఫికేషన్ సమాచారం:

 అర్హత: జనరల్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం. మాస్టర్స్ డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.వయసు: జూనియర్ రీసెర్చ్ ఎపెలోషిప్‌నకు జూన్ 1, 2014 నాటికి 28 ఏళ్లకు మించరాదు. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు యూజీసీ నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. లెక్చరర్ షిప్‌నకు మాత్రం ఎలాంటి వయోపరిమితి లేదు.

 

 రిజిస్ట్రేషన్ ఫీజు:

 జనరల్: రూ.450; ఓబీసీ:రూ.225; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ: రూ.110 బ్యాంక్‌లో చలాన్ రూపంలో మాత్రమే తీయాలి. డి.డి, ఐపీఓ, మనీయార్డర్ రూపంలో చెల్లుబాటు కాదు. 

 

 దరఖాస్తువిధానం:

 www.ugcnetonline.in లేదా www.ugc.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్‌అవుట్ తీసుకోవాలి. దీంతోపాటు బ్యాంక్ చలాన్, సంబంధిత సర్టిఫికెట్లను జతచేస్తూ నిర్దేశించిన చిరునామాకు పంపాలి.

 

 ముఖ్యతేదీలు:

  ఆన్‌లైన్ దరఖాస్తుకు, చలాన్ తీసుకునేందుకు చివరితేదీ: మే, 05, 2014.

  చలాన్ (ఎస్.బి.ఐలో మాత్రమే) ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: మే 07, 2014

  దరఖాస్తు, అటెండెన్స్ రశీదు, అడ్మిట్‌కార్డుల ప్రింట్‌అవుట్ తీసుకోవడానికి చివరి తేదీ: మే 10, 2014

  కోఆర్డినేటింగ్ వర్సిటీలో ప్రింట్‌అవుట్ ధరఖాస్తు సంబంధిత సర్టిఫికెట్ల స్వీకరణకు చివరి తేదీ: మే 15,2014

  పరీక్ష తేదీ: జూన్ 29 2014

  వెబ్‌సైట్: www.ugc.ac.in 

 

 రాష్ట్రంలో కోఆర్డినేటింగ్ యూనివర్సిటీలివే:

  ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం 

  వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

  నాగార్జున యూనివర్సిటీ -గుంటూరు 

  వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in

  ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్

  వెబ్‌సైట్: www.osmania.ac.in

  వెంకటేశ్వర యూనివర్సిటీ- తిరుపతి 

  వెబ్‌సైట్: www.svuniversity.in

 

 ప్రతీ అంశమూ ప్రామాణికమే... 

  యూజీసీ నెట్ పరీక్షకు సన్నద్ధమయ్యేవారు ప్రతీ అంశాన్నీ ప్రామాణికంగానే పరిగణించాలి. అభ్యర్థులు పేపర్-1 నిర్లక్ష్యం చేయడం సరికాదు. పేపర్-1లో పాసైతేనే మిగతా రెండు పేపర్లను మూల్యాంకనం చేస్తారన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఆప్షనల్ సబ్జెక్ట్‌పై పట్టు ఉన్న వారు పేపర్-1పై శ్రద్ధ చూపాలి. పేపర్-1లో ఎక్కువ అంశాలు ఉన్నాయి. ఇందుకోసం యూజీసీ-నెట్ టాటామెక్ గ్రెహిల్స్, యూజీసీ-నె ట్ ఉప్‌కార్ పబ్లికేషన్స్ పుస్తకాలను చదివితే ప్రయోజనకరంగా ఉంటుంది. పేపర్-2,3కు... డిగ్రీ, పీజీ సబ్జెక్ట్ పుస్తకాలను చదవాలి. కనీసం వారానికి ఒకసారి మోడల్ పేపర్లను సాధన చేయాలి. ముఖ్యంగా పేపర్-2,పేపర్-3లు ఆప్షన్ సబ్జెక్టులు కాబట్టి అందులో మెరుగైన స్కోర్ సాధించడానికి ఆస్కారముంటుంది. కానీ పేపర్-1 మాత్రం కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. సమకాలీన అంశాలతోపాటు, గ్రూప్- 1, 2 స్థాయిలో అడిగే లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షివ్, జి.కె,సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలపై ప్రశ్నలను అడుగుతున్నారు. వీటికి ప్రామాణిక పుస్తకాలను చదివితే ప్రయోజనముంటుంది. 

 

 ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్ వెబ్‌సైట్‌లలో దొరుకుతుంది. మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది తెలుగు సబ్జెక్టునే ఎంచుకుంటారు. ఇలాంటి వారంతా ఛందస్సు, అలంకారాలు, బాల,ప్రౌఢ వ్యాకరణం, ధ్వని, రసం, అర్ఘ సంకోచం, అర్థ వ్యాకోచం, జానపద సాహిత్యం, శాసనాలు, ఆధునిక సాహిత్యం, దళిత-స్త్రీ వాద సాహిత్యం అధ్యయనం చేయాలి. ముఖ్యంగా భాషపై పట్టు సాధించడానికి కనీసం 5 కావ్యాల వ్యాఖ్యానాలు చదివితే చాలా వరకు లాభిస్తుంది. పాతపేపర్లను సాధన చేస్తే ఏ ప్రశ్న ఎలా అడుగుతున్నారన్న విషయం తెలుస్తుంది. ఒక ప్రశ్నకు ఇచ్చిన బహుళైచ్ఛిక సమాధానాల నుంచి మరో మూడు ప్రశ్నలను తయారు చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పేపర్-1పై సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. దీన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలి. 

 -బి.భుజంగరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, 

 తెలుగు విభాగం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.

 

 డిసెంబర్ 2013 తెలుగు పేపర్- విశ్లేషణ

 

 2013 డిసెంబర్‌లో జరిగిన పరీక్ష విధానం పరిశీలిస్తే ..పేపర్-1 నుంచి లోతైన పరిజ్ఞానంపై ప్రశ్నలను అడిగారు. ఉదాహరణకు... 

  The first multilingual news agency of India was...

               Samachar B A.P.I.

  Hindusthan Samachar

  Samachar Bharathi 

 Ans: C

 

 వివరణ: హిందూస్థాన్ సమాచార్ 1948లో ఏర్పాటయింది. దీని వ్యవస్థాపకుడు ఎస్.ఎస్ ఆప్టే. తెలుగు, బెంగాళీ, ఒడియా, అస్సామీ, మలయాళం, ఉర్దూ, పంజాబీ, గుజరాత్, హిందీ, మరాఠీ మొత్తం పది భాషలతో ఈ న్యూస్ ఏజెన్సీ ఆవిర్భవించింది. 1975లో ఎమర్జెన్సీ అనంతరం ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, భారతీయ సమాచార్‌లో హిందూస్థాన్ సమాచార్ ఏజెన్సీ విలీనమైంది. 

 ఇక తెలుగు పరీక్ష పేపర్లను పరిశీలిస్తే... పేపర్-2లో

  కింది వాటిలో సరైన జతను గుర్తించండి?

  ఎ) శ్రీనాథుడు- వసుచరిత్ర

  బి) రామరాజ భూషణుడు-శృంగార నైషధం

  సి) అల్లసాని పెద్దన- మనుచరిత్ర

  డి) తెనాలి రామకృష్ణుడు- ఆముక్తమాల్యద

 జవాబు: సి

  వివరణ: వసుచరిత్రను రామరాజభూషణుడు రచించాడు. ఈయననే భట్టుమూర్తి అని కూడా అంటారు. శృంగార నైషధాన్ని శ్రీనాథుడు, ఆముక్తమాల్యదను శ్రీకృష్ణదేవరాయలు రాశారు. తెనాలి రామకృష్ణుడు పాండురంగమహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యంను రచించాడు. ఈ ప్రశ్నను బట్టి కవులు, రచనలపై పట్టు సాధించాల్సి ఉందని అర్థమవుతోంది. 

 

 పేపర్-3 నుంచి మరో ప్రశ్న..

  నాగుల చవితి ఎప్పుడు వస్తుంది?

  ఎ) చైత్ర శుద్ధ చవితి బి) వైశాఖ శుద్ధ చవితి

  సి) మార్గశిర బహుళ చవితి డి) కార్తీక శుద్ధ చవితి

 జవాబు: ఎ

 వివరణ: ఈ ప్రశ్న చాలాసులభంగానే అనిపిస్తుంది. కానీ చాలామంది సరైన సమాధానం గుర్తించలేరు. తెలుగు పండగలు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలి. అలాగే తెలుగు నెలలు, రుతువులు, నక్షత్రాలు, తిథులు, సంప్రదాయాలు కూడా తెలిసి ఉండాలని స్పష్టమవుతోంది. మొత్తంగా పేపర్-2,3లను పరిశీలిస్తే ప్రధానంగా నాలుగు విభాగాల నుంచి మాత్రమే ప్రశ్నలు వచ్చాయి. 2013 డిసెంబర్ నాటి తెలుగు పేపర్‌లో ఏయే అంశాల నుంచి ఎన్ని ప్రశ్నలను అడిగారో పరిశీలిస్తే... 

 ప్రశ్నరకం పేపర్-2 పేపర్-3

 బహుళైచ్ఛిక 10 20 

 ఒకే వర్గానికి చెందిన 

 రెండు సమాధానాలు 10 18 

 నిర్దేశం-హేతువు 05 12 

 కాలక్రమాల వరుస 10 11

 జతపరచుట 10 14

 అపరిచిత పద్యం 05 -

 మొత్తం 50 75
Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top