నీట్ - పీజీ

నీట్ - పీజీ


నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్).. జాతీయ స్థాయిలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్ష. ఇప్పటికే నీట్‌యూజీ ద్వారా2016 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలు  జరుగుతున్నాయి. తాజాగా నీట్-పీజీ 2017 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పరీక్ష విధివిధానాలు..

 

 నీట్ పీజీ ఉద్దేశం

 దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్-పీజీ నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

 

 నీట్-పీజీ అర్హత వివరాలు

ఎంబీబీఎస్, ఎంసీఐ ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. 2017, మార్చి 31 లోపు రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేయాలి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 2017, ఏప్రిల్ 15 లోపు రొటేటరీ ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.

 

 ఆ ఆరు మినహా..

 దేశంలోని ఆరు ఇన్‌స్టిట్యూట్‌లు నీట్ పీజీ పరిధిలోకి రాకుండా మినహాయింపు ఇచ్చారు. అవి.. ఎయిమ్స్-న్యూఢిల్లీ; పీజీఐఎంఈఆర్-చండీగఢ్, జిప్‌మర్ -పుదుచ్చేరి, ఎస్‌జీపీజీఐఎంఎస్-లక్నో, నిమ్‌హాన్స్-బెంగళూరు, శ్రీ చిత్ర తిరునల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ- తిరువనంతపురం. ఈ ఇన్‌స్టిట్యూట్‌లు తమ పరిధిలోని సీట్ల భర్తీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తాయి. అభ్యర్థులు సైతం వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

 

 పరీక్ష ఇలా

 నీట్ పీజీ పరీక్షను 300 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులుండవు. మొత్తం 300 ప్రశ్నలు ఉండే పరీక్షలో ఎంబీబీఎస్ స్థాయిలోని 15 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి..



ఫోరెన్సిక్ మెడిసిన్, ఆప్తాల్మాలజీ, సైకియాట్రిక్స్ ఒక్కో విభాగం నుంచి పది ప్రశ్నలు ఠి అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పీడియాట్రిక్స్ ఒక్కో విభాగం నుంచి 15 ప్రశ్నలు ఠి పాథాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఆబ్‌స్ట్రెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు ఠి మెడిసిన్, డెర్మటాలజీ, వెరనాలజీ విభాగాల నుంచి 37 ప్రశ్నలు ఠి సర్జరీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా విభాగాల నుంచి 46 ప్రశ్నలు ఠి రేడియో డయాగ్నసిస్, రేడియో థెరపీ విభాగాల నుంచి 12 ప్రశ్నలు ఠి ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ ఒక్కో విభాగంలో 20 ప్రశ్నలు.

 

 కనీస అర్హత మార్కులు సాధిస్తేనే

 నీట్ -పీజీలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 40 శాతం కనీస మార్కులు సాధించాలి. వీరిని మాత్రమే కౌన్సెలింగ్‌కు పిలుస్తారు.

 

 కౌన్సెలింగ్ ఇలా..

 ఠి ఆల్ ఇండియా కోటాలో 50 శాతం: దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశానికి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. వీరు ఆన్‌లైన్ విధానంలో సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 50 శాతం మేరకు అందుబాటులో ఉండే సీట్లకు ఐదింతలు ఎక్కువగా మాత్రమే అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. అంటే ఒక్కో సీటుకు ఐదుగురు చొప్పున కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. స్టేట్ కోటాలో 50 శాతం: ఆల్ ఇండియా కోటాకు 50 శాతం సీట్లు పోగా మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల పరిధిలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు.

 

 ఏపీ, టీఎస్‌లకు వర్తించని ఆల్ ఇండియా కోటా

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటా సీట్లకు పోటీ పడే అర్హత లేదు. వీరు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కళాశాలలకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది.

 

 దరఖాస్తు విధానం

 ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

 ముఖ్య తేదీలు

 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:

 అక్టోబర్ 31, 2016.

 ఆన్‌లైన్ పరీక్ష తేదీలు:

 డిసెంబర్ 5 నుంచి 13 వరకు

 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:

 హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం

 

 ఉమ్మడి పరీక్ష ప్రయోజనకరం

 పీజీ స్థాయిలో నీట్ పేరుతో జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడం విద్యార్థులకు ప్రయోజనకరం. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో పోటీ పడే అవకాశం లేకపోయినా.. బహుళ ఎంట్రెన్సులు రాయాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశించాలంటే ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే ఏపీపీజీమెట్, నిమ్స్ నిర్వహించే పీజీ మెట్‌లు రాయాల్సి ఉండేది. ఎంబీబీఎస్ స్థాయిలో బేసిక్స్, ప్రివెంటివ్ మెడిసిన్‌పై అవగాహన ఉన్నవారు మెరుగైన మార్కులు సొంతం చేసుకోవచ్చు.

 - డాక్టర్. నంద కిశోర్, ఎంసీఐ సభ్యులు

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top