మెడికల్ కౌన్సెలింగ్ విధి విధానాలు

మెడికల్ కౌన్సెలింగ్ విధి విధానాలు


కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు సంబంధిత ధ్రువపత్రాలన్నీ తప్పనిసరిగా తీసుకురావాలి. ఏ ఒక్కటి లేకున్నా కౌన్సెలింగ్‌లో అనర్హతకు గురయ్యే ఆస్కారం ఉంది. సీట్లు పొందిన విద్యార్థులు ఎంసెట్ కోసం పడిన శ్రమకు ప్రతిఫలం లభించిందని సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో మంచి వైద్యునిగా గుర్తింపు పొందడం లక్ష్యంగా చేసుకోవాలి. దీని కోసం కళాశాలలలో చేరిన మొదటి రోజు నుంచే శ్రమించాలి.

 -డాక్టర్ టి. రవి రాజు, వీసీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ

 

 రాష్ట్ర విభజన అనంతరం తొలి సారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగా మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే కౌన్సెలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఆన్‌లైన్ పద్ధతిలో ఐదు కేంద్రాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. కేంద్రాల వివరాలు..


 జేఎన్‌టీయూ- హైదరాబాద్

 కాకతీయ యూనివర్సిటీ-వరంగల్

 ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం

 ఎస్వీ యూనివర్సిటీ -తిరుపతి.

 విద్యార్థులు ఈ ఐదు కేంద్రాల్లో ఎక్కడైనా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు.

 

 కొత్తగా:

 ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 150 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 120 జీవో మేరకు 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటా కిందకు వస్తాయి. మిగతా 127 సీట్లకు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఇందులో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకు (ఆంధ్రప్రదేశ్) కేటాయించారు. మరో 15 శాతం సీట్లను అన్ రిజర్వుడ్ కింద భర్తీ చేస్తారు.

 

 అర్హత-వయసు:

 మెడికల్/డెంటల్ కోర్సుల్లో చేరాలంటే ఎంసెట్ ర్యాంక్‌తోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్దేశించిన కొన్ని అర్హతలు తప్పనిసరి. అవి..

 

 ఓపెన్ కేటగిరీ 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణత (బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు 40 శాతం; ఓసీ వికలాంగ విద్యార్థులు 45 శాతం మార్కులు సాధించాలి)ఎంసెట్‌లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం (80 మార్కులు); బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం (64 మార్కులు); ఓసీ పీహెచ్ అభ్యర్థులు 45 శాతం (72 మార్కులు) పొంది ఉండాలి. వ యసు: 31-12-2014 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 02-01-1998 తర్వాత జన్మించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అనర్హులు.

 

 కావల్సిన సర్టిఫికెట్లు:

 ఎంసెట్ హాల్‌టికెట్

 ఎంసెట్ ర్యాంకు కార్డు

 జనన ధ్రువీకరణ పత్రం (ఎస్‌ఎస్సీ/తత్సమాన సర్టిఫికెట్)

 ఇంటర్మీడియెట్/తత్సమాన మార్కుల జాబితా

 టీసీ (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్)

 ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు

 ఇతర రాష్ట్రాల్లో చదివి ఉంటే... తహసీల్దార్/ఎంఆర్‌ఓ జారీ చేసిన పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్

 స్పెషల్ కేటగిరీ కింద హాజరయ్యే విద్యార్థులకు నిర్దేశించిన సర్టిఫికెట్లు

 రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు ఎంఆర్‌ఓ/తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్), ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న విద్యార్థులు ఎంఆర్‌ఓ/ తహసీల్దార్ 1-1-2014 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్.

 

 కౌన్సెలింగ్ ఫీజులు:

 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు అటెస్ట్ చేసిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థులు యూనివర్సిటీ, ట్యూషన్ ఫీజులను కౌన్సెలింగ్ కేంద్రాల్లోనే ఏర్పాటు చేసిన బ్యాంక్ కౌంటర్లలో చెల్లించాలి.

 

 గతంలో మాదిరిగానే:

 గతంలో మాదిరిగానే ఉస్మానియా, ఆంధ్రా, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ల వారీగా కౌన్సెలింగ్ జరుగుతుంది. స్థానికతను నిర్ణయించడానికి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ (అర్హత పరీక్ష) వరకు విద్యార్ధి చదివిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియెట్‌తో సహా అంతకు ముందు వరుసగా ఏడేళ్లు (ఆరు నుంచి ఇంటర్ వరకు)ఏ యూనివర్సిటీ పరిధిలో చదివితే ఆ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్/డెంటల్ కళాశాలకు స్థానిక అభ్యర్థిగా గుర్తింపు లభిస్తుంది. అలా కాకుండా ఇంటర్మీడియెట్‌లోపు వేర్వేరు యూనివర్సిటీ పరిధిల్లో సమానంగా చదివి ఉంటే... ఇంటర్మీడియెట్ పూర్తి చేసే నాటికి ఏ వర్సిటీ పరిధిలో చదివితే ఆ వర్సిటీ స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు.

 

 మొదట అన్ రిజర్వ్‌డ్:

 కౌన్సెలింగ్‌లో మొదట అన్‌రిజర్వుడ్ కేటగిరీ కింద 15 శాతం ీసీట్లను భర్తీ చేస్తారు. తర్వాత 85 శాతం లోకల్ సీట్లలో ప్రవేశ ప్రకియను చేపడతారు. తొలుత భర్తీ చేసే 15 శాతం అన్‌రిజర్వుడ్ సీట్ల కోసం... విద్యార్థులు తమ రీజియన్‌తో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాలలోని కళాశాలల్లో సీట్ల కోసం పోటీ పడొచ్చు. సీట్లను భర్తీ చేసే క్రమంలో రిజర్వేషన్, స్థానికతతో నిమిత్తం లేకుండా ముందుగా ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుందో? లేదో చూస్తారు. తర్వాత యూనివర్సిటీ ఏరియా, రిజర్వేషన్, లోకల్, నాన్‌లోకల్ వీటిని వరుసగా పరిగణనలోకి తీసుకుని సీటును కేటాయిస్తారు. మెరిట్ అభ్యర్థి నాన్‌లోకల్ ఏరియాలో ఎక్కడైనా సీటు పొందే అవకాశం ఉంది.

 

 నిబంధనల ప్రకారం:

 రెండు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉంటుంది.

 

 జీవో నం. 165:

 ప్రభుత్వం 2010, జూలై 20వ తేదీన విడుదల చేసిన జీవో నం.165 ప్రకారం మెడికల్, డెంటల్ కోర్సుల్లో సీట్లు పొంది న అభ్యర్థులు కోర్సు పూర్తయిన వెంటనే సంవత్సర కాలం పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పని చేయాలి.

 

 ఫీజులు: ఎంబీబీఎస్:

 వర్సిటీ ఫీజు రూ.    ట్యూషన్ ఫీజు రూ.

 ప్రభుత్వ కళాశాల    7,000    10,000

 ప్రైవేట్-ఎ:     11,500    60,000

 ప్రైవేట్-బి:     20,500    2,40,000

 

 బీడీఎస్:

 ప్రభుత్వ కళాశాల     6,000     9,000

 ప్రైవేట్-ఎ:    10,500     45,000

 ప్రైవేట్-బి:     14,500    1,30,000

 ఆర్మీ డెంటల్:    14,500    1,35,000

 వెబ్‌సైట్: http://ntruhs.ap.nic.in

 -రాజ్‌కుమార్ ఆలూరి, న్యూస్‌లైన్, విజయవాడ.

 

 మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరుగుతుంది. షెడ్యూల్ వివరాలు..

 ఆగస్టు 30, 2014    అన్ని కేటగిరీల వారికి    ఉదయం 9 గం.     1-800 ర్యాంకు వరకు

 మధ్యాహ్నం 1 గం.    801-1500 ర్యాంకు వరకు

 ఆగస్టు 31, 2014    అన్ని కేటగిరీల వారికి    ఉదయం 9 గం.    1501-3000 ర్యాంకు వరకు

 మధ్యాహ్నం 1 గం.    3001-4500 ర్యాంకు వరకు

 సెప్టెంబర్ 1, 2014    అన్ని కేటగిరీల వారికి    ఉదయం 9 గం.    4501-6500 ర్యాంకు వరకు

 మధ్యాహ్నం 1 గం.    6501-8500 ర్యాంకు వరకు

 సెప్టెంబర్ 2, 2014    బీసీ-ఎ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి     ఉదయం 9 గం.     1-2000 ర్యాంకు వరకు

 మధ్యాహ్నం 1 గం.     2001-3000 ర్యాంకు వరకు

 సెప్టెంబర్ 3, 2014    బీసీ-ఎ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి    ఉదయం 9 గం.    3001-4500 ర్యాంకు వరకు

 మధ్యాహ్నం 1 గం.    4501-6500 ర్యాంకు వరకు

 సెప్టెంబర్ 4, 2014    బీసీ-ఎ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి    ఉదయం 9 గం.     6501-8000 ర్యాంకు వరకు

 మధ్యాహ్నం 1 గం.     8001-10000 ర్యాంకు వరకు

 సెప్టెంబర్ 5, 2014    ఎస్సీ కేటగిరీ వారికి     ఉదయం 9 గం.    10001-15000 ర్యాంకు వరకు

 ఏయూ పరిధిలోని బీసీ-ఈ కేటగిరీ వారికి    మధ్యాహ్నం 1 గం.    10001-20000 ర్యాంకు వరకు

 ఎస్వీయూ, ఏయూ పరిధిలోని ఎస్టీ కేటగిరీ వారికి    మధ్యాహ్నం 1 గం.    10001-20000 ర్యాంకు వరకుఏయూ పరిధిలోని ఎస్టీ కేటగిరీ వారికి    మధ్యాహ్నం 1 గం.    20001-25000 ర్యాంకు వరకు

 ఎన్‌సీసీ, ఆర్మీ, క్రీడాకారులు, వికలాంగులు, పోలీస్ మిలటరీ చిల్డ్రన్ కేటగిరీ విద్యార్థులకు సెప్టెంబర్ 7, 8 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

 

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top