కాంపిటీటివ్ గైడెన్స్ కరెంట్ అఫైర్స్
భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా వద్ద నిర్మించిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జనవరి 31న ప్రారంభించారు. దీన్ని కేవలం 10 నెలల వ్యవధిలోనే పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, డోర్నకల్ (మహబూబాబాద్ జిల్లా) మండలాల్లోని మొత్తం 60 వేల ఎకరాలకు సాగునీరందుతుంది.
జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్
జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ను శరత్ కమల్, మహిళల సింగిల్స్ టైటిల్ను మధురిక పాట్కర్ గెలుచుకున్నారు. మనేసర్ (హరియాణా)లో ఫిబ్రవరి 5న జరిగిన ఫైనల్లో సౌమ్యజిత్ ఘోశ్పై శరత్ కమల్ గెలుపొందగా, మహిళల సింగిల్స్ ఫైనల్లో మధురిక పాట్కర్ ఆరుసార్లు చాంపియన్ పౌలోమి ఘాటక్ను ఓడించింది. తాజా టైటిల్తో కలిపి శరత్ ఏడుసార్లు ఈ టైటిల్ను గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్ను సౌమ్యజిత్ ఘోశ్, జుబిన్ కుమార్ల జోడి గెలుచుకుంది. వీరు ఫైనల్లో సుస్మిత్ శ్రీరామ్, అనిర్బన్ ఘోశ్లను ఓడించారు. మహిళల డబుల్స్ టైటిల్ను అనిందితా చక్రవర్తి, సుతిత్రా ముఖర్జీ గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో పౌలోమి ఘాటక్, మౌమాదాస్లను ఓడించారు.
∙ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్ను గెలుచుకున్న భారత్
ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్ను భారత్ గెలుచుకుంది. ఆరేళ్ల తర్వాత భారత్కు ఈ టైటిల్ దక్కింది. ఫిబ్రవరి 5న హాంగ్కాంగ్లో జరిగిన ఆసియా జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాపై భారత్ గెలుపొందింది.
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్