సివిల్స్ ప్రిలిమ్స్–2017..జీఎస్ కటాఫ్ 110!
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్–2017కు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... ప్రిలిమ్స్కు 45 శాతం హాజరు నమోదైంది. పరీక్ష కేంద్రాలకు ఎంతో ఉత్సాహంగా వెళ్లిన అభ్యర్థులు ప్రశ్నపత్రం చూసి కంగుతిన్నారు. కారణం.. పరీక్ష గత రెండు, మూడేళ్లతో పోల్చితే కఠినంగా ఉండటమే! ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం విశ్లేషణ, జీఎస్ కటాఫ్, తదుపరి దశ
మెయిన్స్కు అనుసరించాల్సి వ్యూహాలపై ఫోకస్..
కరెంట్ అఫైర్స్, పాలిటీకి ప్రాధాన్యం
ఈసారి సివిల్స్ ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ ఆధారిత అంశాలు, పాలిటీకి ప్రాధాన్యం లభించింది. జనరల్ స్టడీస్ పేపర్ (పేపర్–1)లోని మొత్తం 100 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు ఈ రెండు విభాగాల నుంచి అడగడం విశేషం. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్లో కాన్సెప్ట్+ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలు అడగడంతో అభ్యర్థులు సమాధానాలు ఇవ్వడానికి సమయాభావ సమస్య ఎదురైంది. పథకాల గురించి ఎక్కువగా అడిగారు. అంతేకాకుండా కొత్త పాలసీలు, చట్టాల గురించి 14 ప్రశ్నలు వచ్చాయి. గతేడాది కాలంగా పత్రికలను బాగా అనుసరించిన అభ్యర్థులకు ప్రిలిమ్స్ కొంత అనుకూలంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పాలిటీ, ఎకానమీ
పాలిటీ నుంచి దాదాపు 25 ప్రశ్నలు అడిగారు. అయితే ఈ ప్రశ్నలు డైరెక్ట్గా ఉండటం కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. భారత రాజ్యాంగంపై ప్రాథమిక అవగాహన, ఆర్టికల్స్, షెడ్యూల్స్పై పరిపూర్ణ అవగాహన ఉన్న అభ్యర్థులు తేలిగ్గా సమాధానాలిచ్చేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎకానమీ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ప్రశ్నలు ఎదురయ్యాయి.
హిస్టరీ.. క్లిష్టంగా..
హిస్టరీకి సంబంధించి మొత్తం 12 ప్రశ్నలు అడగ్గా.. వాటిలో ఆధునిక చరిత్ర నుంచి ఆరు, ప్రాచీన చరిత్ర నుంచి ఆరు చొప్పున ప్రశ్నలు వచ్చాయి. అంటే ఈ విభాగంలో సమతుల్యత పాటించినట్టు భావించాలి. ప్రాచీన భారత చరిత్ర నుంచి అడిగిన ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయి. అదే విధంగా వివిధ రాజ్యాల కాలంలో కళలు, సంస్కృతికి సంబంధించి ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలు అడగడం అభ్యర్థులను ఇబ్బందికి గురి చేసింది.
జాగ్రఫీ, పర్యావరణం, సైన్స్
∙జాగ్రఫీ నుంచి మ్యాప్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. అట్లాస్పై పరిపూర్ణ అవగాహన ఉన్న అభ్యర్థులు ఈ విభాగంలో అడిగిన ప్రశ్నలకు సులువుగా సమాధానాలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు క్లిష్టంగా ఉండటం అభ్యర్థులకు ప్రతికూల పరిణామంగా చెప్పొచ్చు.
∙ఈసారి కూడా జనరల్ స్టడీస్ పేపర్లో పర్యావరణ అంశాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని చెప్పొచ్చు. సుమారు 15 ప్రశ్నలు ఈ విభాగం నుంచి అడిగారు. ఈ ప్రశ్నలు కూడా ఇటీవల కాలంలో పర్యావరణ సమస్య పరిష్కారం దిశగా చేపడుతున్న చర్యల ఆధారంగా ఉండటంతో వీటిని కూడా కరెంట్ అఫైర్స్ సమ్మిళిత ప్రశ్నలుగా పేర్కొనొచ్చు. సివిల్స్ ప్రిలిమ్స్–2017 జీఎస్లో ప్రధానంగా గమనించాల్సిన అంశం.. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అయిదు ప్రశ్నలు మాత్రమే అడగడం.
కటాఫ్.. గతేడాది కంటే తక్కువే
ప్రిలిమ్స్–2017 పరీక్ష శైలి, ప్రశ్నలు అడిగిన తీరును చూస్తే కటాఫ్ గతేడాది కంటే తక్కువగా ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తం 200 మార్కులకు నిర్వహించిన జనరల్ స్టడీస్ పేపర్లో కటాఫ్ 110 నుంచి 116 మధ్యలో ఉంటుందని అంచనా.
యూపీఎస్సీ శైలిని విశ్లేషిస్తే.. అభ్యర్థుల్లో సమకాలీన సమస్యలు, అంశాలపై ఉన్న అవగాహనను పరీక్షించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే ధోరణి మెయిన్లోనూ కనిపించొచ్చు. కాబట్టి అభ్యర్థులు కోర్ + కాంటెంపరరీ అంశాలను సమన్వయం చేసుకుంటూ చదవాలి.
– శ్రీరామ్, డైరెక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ.