సివిల్స్ మెయిన్ 75days సక్సెస్ ప్లాన్

సివిల్స్ మెయిన్ 75days  సక్సెస్ ప్లాన్


యూపీఎస్సీ కోరుకునేదేమిటి?

 మెయిన్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ముందుగా అభ్యర్థి నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏం కోరుకుంటోందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీనికోసం గత పదేళ్ల సివిల్స్ మెయిన్ ప్రశ్న పత్రాలను విశ్లేషించి పరీక్ష తీరుతెన్నులపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన వ్యూహం రూపొందించుకోవాలి. వాస్తవానికి యూపీఎస్సీ అభ్యర్థుల్లోని నిర్ణయాత్మక శక్తిని, విశ్లేషణ నైపుణ్యాలను, తార్కిక విశ్లేషణను పరిశీలించేందుకు ప్రయత్నిస్తుంది.

 

 ఆప్షనల్స్‌కు ప్రాధాన్యమిస్తూ..

 మెయిన్ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు ముందుగా ఆప్షనల్ సబ్జెక్ట్‌లకు ప్రాధాన్యమివ్వాలి. వీటికి సంబంధించి బేసిక్స్‌పై అవగాహన పెంచుకుంటూ.. వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయిస్తూ చదువుకోవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించడం ఎంతో మేలు చేస్తుంది. ఆయా సబ్జెక్టుల్లోని సిద్ధాంతాల ఆధారంగా తాజాగా సంబంధిత రంగాల్లో జరిగిన మార్పుల గురించి చర్చించాలని అడిగే అవకాశముంది.

 

 జనరల్ ఎస్సేలో రాణించాలంటే...

 సివిల్స్ మెయిన్ అభ్యర్థులు జనరల్ ఎస్సే పేపర్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎందుకంటే.. జనరల్ ఎస్సే విజయావకాశాలను ప్రభావితం చేయడంలో కీలకంగా మారుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ముందుగా జనరల్ ఎస్సే పేపర్ పరంగా ప్రశ్నలు అడిగే అవకాశమున్న అంశాలను గుర్తించాలి. ప్రధానంగా అంతర్జాతీయ అంశాలపై దృష్టి పెట్టాలి. వీటితోపాటు జాతీయ స్థాయిలో తాజాగా జరిగిన పరిణామాలు-అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో వాటి ప్రభావం గురించి తెలుసుకోవాలి. ఆయా అంశాలకు  సంబంధించిన ముఖ్యాంశాలు నోట్ చేసుకోవాలి.

 

 కూర్పులో నేర్పుగా...

 జనరల్ ఎస్సే ప్రజెంటేషన్ విషయంలో అభ్యర్థులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. తమకు పరిజ్ఞానం ఉందనే ఉద్దేశంతో అన్ని అంశాలు రాయాలనుకోకుండా.. నిర్దిష్టంగా ఒక ఎస్సేకు లభించే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన అంశాలను సమీకృతం చేస్తూ రాయడం మంచిది. ఉపోద్ఘాతం, వివరణ, ముగింపు అనే మూడు ముఖ్య సూత్రాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సే రాయడం అలవర్చుకోవాలి.

 

 జీఎస్.. ఫోకస్డ్ ప్రిపరేషన్..

 జనరల్ స్టడీస్ విషయంలో అభ్యర్థులకు ఫోకస్డ్ ప్రిపరేషన్ అవసరం. అన్ని విషయాలు తెలుసుకోవాలనే దృక్పథం మంచిదే. అయితే, అందుబాటులో ఉన్న సమయం, సదరు అంశానికి పరీక్ష పరంగా ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ముందుకు సాగాలి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రత్యేక దృష్టితో వ్యవహరించాలి. ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించే నైపుణ్యం అలవర్చుకోవాలి. జనరల్ స్టడీస్ పేరుతో నాలుగు పేపర్లకు సంసిద్ధులు కావాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి కోర్ అంశాలను కాంటెంపరరీ పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి.

 

 పథకాలపై ప్రత్యేక దృష్టి

 ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ముఖ్యంగా జనరల్ ఎస్సే విషయంలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో పలు పథకాలు రూపొందాయి. వాటి ఉద్దేశం-లక్ష్యం-కార్యాచరణ ప్రణాళిక - సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకోవాలి. వీటికి సంబంధించి ఇప్పటికే ఆయా రంగాల్లోని నిపుణుల విశ్లేషణలు చదవడం ఎంతో లాభిస్తుంది.

 

 రైటింగ్, ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం..

 అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే అలవర్చుకోవాల్సిన మరో ముఖ్య లక్షణం.. రైటింగ్ ప్రాక్టీస్. పరీక్షలో ఒక ప్రశ్నకు లభించే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా రోజూ ప్రశ్నలు-సమాధానాలు ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం టైం రిమైండర్ సెట్ చేసుకోవాలి. నిర్ణీత టైం ముగియగానే ఆ సమాధానం రాయడం ఆపేయాలి. ఆ తర్వాత ఆ సమాధానంలో రాయలేకపోయిన ముఖ్యాంశాలు లేదా అనవసరంగా రాసిన అంశాల గురించి స్వీయ విశ్లేషణ చేసుకోవాలి.

 

 రోజూ అన్ని సబ్జెక్టులు చదివేలా..

 మెయిన్ అభ్యర్థులు రోజూ అన్ని  సబ్జెక్టులు చదివేలా టైంటేబుల్ రూపొందించుకోవాలి. దీనికి భిన్నంగా కొన్ని రోజులు పూర్తిగా ఒక సబ్జెక్టుకు కేటాయించి, తర్వాత మరో సబ్జెక్ట్ చదివే విధానం వల్ల చివరి దశలో ప్రతికూల ఫలితాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రతి రోజూ ప్రతి సబ్జెక్ట్ చదివే విధానం వల్ల పరీక్ష సమయానికి అన్ని సబ్జెక్ట్‌లను పూర్తి చేయగలిగే అవకాశం ఉంటుంది. అలాగే అభ్యర్థులు తమకు ఇష్టమైన అంశాలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఆసక్తి లేని టాపిక్స్‌తో మొదలుపెడితే ఫలితం ప్రతికూలంగా ఉంటుంది. మొత్తం ప్రిపరేషన్‌పై ఆ ప్రభావం పడుతుంది.

 

 విజయానికి వీక్లీ టెస్ట్‌లు..

 అభ్యర్థులు స్వయంగా లేదా నిపుణుల ఆధ్వర్యంలో వీక్లీ టెస్ట్‌లు రాసి, మూల్యాంకనం చేయించుకోవాలి. ఫలితంగా ఎప్పటికప్పుడు తాము ఇంకా మెరుగవాల్సిన అంశాలపై అవగాహన వస్తుంది.

 

 అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో..

 మెయిన్ అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి బేసిక్స్‌ను ఇప్పుడు చదవాలనుకోవడం సరికాదు. వాటికి సంబంధించిన సినాప్సిస్‌ను పరిశీలించి, అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో ప్రిపరేషన్ కొనసాగించాలి. నవంబర్ 15 నాటికి ప్రిపరేషన్ పూర్తి చేసుకొని, ఆ తర్వాత నుంచి రివిజన్‌కు కేటాయించాలి.

 - శ్రీరామ్, డెరైక్టర్,  రామ్స్ ఐఏఎస్ స్టడీ సర్కిల్

 

 విశ్లేషణాత్మక దృక్పథం..

 అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశంపై విశ్లేషణాత్మక దృక్పథంతో ముందుకు సాగాలి. కేవలం మెటీరియల్‌లో పేర్కొన్న పాయింట్లను యథాతథంగా రీ-ప్రజెంట్ చేయాలనే విధానం సరికాదు.     - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్,

 ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్



 పాయింటర్ అప్రోచ్

 మెయిన్ అభ్యర్థులు రివిజన్ పరంగా పాయింటర్ అప్రోచ్‌ను అవలంబించాలి. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు అందులోని ముఖ్యమైన సబ్ టాపిక్స్‌ను అండర్‌లైన్ చేసుకోవడం లేదా పాయింట్స్ రూపంలో సొంత నోట్స్ రూపొందించుకోవడం వల్ల రివిజన్ ఫలవంతంగా ఉంటుంది.

- వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ

 

 ముఖ్యమైన టాపిక్స్

 అంతర్జాతీయ సదస్సులు, భారత్‌పై ప్రభావం

 జీఎస్‌టీ బిల్లు  భూసేకరణ చట్టం

 ఇండియన్ ఎకనమిక్ సర్వే పేర్కొన్న అంశాలు

 ఇటీవల ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శన, భారత క్రీడా విధానం

 ప్రభుత్వ పథకాలు

 భారత ఉపగ్రహ ప్రయోగాలు

 పర్యావరణ పరిరక్షణ- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకుంటున్న చర్యలు

 బడ్జెట్ ముఖ్యాంశాలు - ఆయా రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యత

 ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల్లో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్

 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top