16న కుక్కునూరు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి
వేలేరుపాడు : పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఈనెల 16న కుక్కునూరులో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు రాష్ట్ర సీపీఐ కౌన్సిల్ సభ్యుడు ఎండీ మునీర్ తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పిట్టా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతంలో ప్రజలు అనేక సమస్యలతో తల్లడిల్లిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడంలేదని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి అన్ని గ్రామాల నిర్వాసితులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. 16న జరిగే సబ్ కలెక్టర్ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. వేలేరుపాడు మండలంలో 9 గ్రామ పంచాయతీలను యూనిట్గా తీసుకుని ముంపు గ్రామాలుగా ప్రకటించాలని, ఆయా గ్రామాల్లో గిరిజన, గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న అన్నిరకాల భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సన్నేపల్లి సాయిబాబా, ఏఐటీయూసీ కార్యదర్శి కారం దారయ్య, గోలి వెంకన్నబాబు, బాడిశ రాము, ఇందిర, కుమారి పాల్గొన్నారు.