చైనా అవాక్కులు!

చైనా అవాక్కులు!


దౌత్యపరమైన సమస్యలెన్ని ఉన్నా దాదాపు మర్యాదస్తుల్లా మాట్లాడుకునే అలవాటున్న భారత్‌–చైనాల మధ్య ఇప్పుడు వాగ్యుద్ధం నడుస్తోంది. బౌద్ధ ఆధ్యాత్మిక వేత్త దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటన చుట్టూ ఈ వివాదం రాజుకుంది. దలైలామా అరుణాచల్‌ పర్యటననూ, మరీ ముఖ్యంగా తవాంగ్‌ వెళ్లడాన్నీ చైనా జీర్ణించుకోలేకపోతోంది. బీజింగ్‌లో భారత రాయబారి వీకే గోఖలేను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిచి నిరసనను వ్యక్తం చేసింది.



అంతేకాదు... తమ అసంతృప్తిని పట్టించుకోకుండా ‘మొండిగా’ దలైలామా పర్యటనకు ఏర్పాట్లు చేసిందని మన దేశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సార్వభౌమత్వాన్నీ, న్యాయ బద్ధమైన హక్కుల్ని, ప్రయోజనాలనూ పరిరక్షించుకోవడానికి ‘అవసరమైన’ చర్య లన్నీ తీసుకుంటామని హెచ్చరించింది. చైనా ప్రభుత్వం ఇలా మాట్లాడుతుంటే అక్కడి మీడియా ఇంకో అడుగు ముందుకేసింది. దెబ్బకు దెబ్బ తీయాలని ఒక పత్రిక, చైనా అంతరంగాన్ని భారత్‌ తక్కువ అంచనా వేస్తున్నదని మరో పత్రిక వ్యాఖ్యానించాయి. మన దేశం మాత్రం ఈ పర్యటనకు రాజకీయ రంగు పులిమి కృత్రిమ వివాదాలను సృష్టించవద్దని చైనాకు హితవు పలికింది.



అరుణాచల్‌ ‘వివాదాస్పద’ ప్రాంతమని అనడం చైనాకు కొత్తేమీ కాదు. అప్పు డప్పుడు అది తమ దేశంలో అంతర్భాగమని చెప్పడం కూడా రివాజే. అలాగని ఆ రాష్ట్రానికీ, ప్రత్యేకించి తవాంగ్‌కు వెళ్లడం దలైలామాకు కొత్తగాదు. ఇప్పటికి అరడజనుసార్లు ఆయన పర్యటించారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందు కొచ్చాయో... గతానికీ, ఇప్పటికీ అది గమనించిన తేడా ఏమిటో చైనా చెప్పాలి. ఆ సంగతి వదిలిపెట్టి అది హెచ్చరికలకు దిగుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 1962లో చైనాతో యుద్ధం వచ్చాక ఆ దేశంతో మన సంబంధాలు అంతంత మాత్రమే. జనతా పార్టీ హయాంలో అప్పటి విదేశాంగమంత్రి వాజపేయి చొరవ కారణంగా ఆ స్థితి మారింది. ఇరు దేశాల నేతలూ పరస్పరం పర్యటించడం మొద లైంది. 1988 తర్వాత అవి మరింత పెరిగాయి. ఇరుదేశాల మధ్యా శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి.



ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూనే పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో సహకరించుకుందామని కూడా ఇరుదేశాలూ నిర్ణయించుకున్నాయి. ఇవన్నీ కొనసాగుతుండగా చైనా అప్పుడప్పుడు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రాంతం విషయంలో ఇరు దేశాల మధ్యా భిన్నాభిప్రాయాలున్న మాట నిజమే. తమ భూభాగం సుమారు 90,000 చదరపు కిలోమీటర్లు భారత్‌ స్వాధీనంలో ఉన్నదని చైనా ఆరోపిస్తుండగా... 38,000 చద రపు కిలోమీటర్ల ప్రాంతం చైనా దురాక్రమించిందన్నది మన వాదన. పరస్పర చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకుందామని, ఈలోగా యథాతథ స్థితిని కొనసాగిద్దామని రెండు దేశాలూ ఎన్నడో అవగాహనకొచ్చాయి.



అయినా అప్పుడప్పుడు సరిహద్దుల్లో గిల్లికజ్జాలు పెట్టుకోవడం చైనా మానుకోలేదు. ఏదో పొర పాటున మన గగనతలంలోకి వచ్చినట్టుగా చైనా హెలికాప్టర్లు, విమానాలు అరుణాచల్‌ ప్రాంతంలోకి చొచ్చుకురావడం రివాజు. అప్పుడప్పుడు చైనా సైన్యం కూడా మన భూభాగంలోకి ఏదో పని ఉన్నట్టు జొరబడుతుంటాయి. అరుణాచల్‌కు మన ప్రధానులు వెళ్లినప్పుడల్లా ‘వివాదాస్పద ప్రాంతం’లోకి ఎందుకెళ్తున్నారని నిరసన వ్యక్తం చేయడం, అసంతృప్తిని, అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం చైనాకు అలవాటు. కానీ ఈసారి మాటలు మీరింది. సరిహద్దుల్లో ‘అవసరమైన’ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తోంది.



చైనా ఇలా గొంతు పెంచడంలోని మర్మం ఏమిటి? భారత్‌తో స్నేహానికి ప్రాధా న్యమిస్తున్నామంటూనే దౌత్య సంప్రదాయానికి భిన్నమైన రీతిలో స్పందించడానికి, తన మీడియా ద్వారా బెదిరింపు ధోరణులను ప్రదర్శించడానికి కారణమేమిటి? దక్షిణ చైనా సముద్రం వివాదంలో మనం అమెరికా వాదనకు సన్నిహితమవు తున్నామన్న అభిప్రాయం చైనాకు ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. ట్రంప్‌ వచ్చాక ఆ రెండు దేశాల మధ్యా సంబంధాలు ఏమంత సజావుగా లేవు. వాణిజ్య రంగంలో ఇరు దేశాలూ పరస్పరం కలహించుకుంటున్నాయి. దౌత్య మర్యాదల్లో భాగంగా జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ఇవ్వా ల్సిన విందు కార్యక్రమం లేదు. ఇరు దేశాలమధ్యా ఉద్రిక్తతలు ఏర్పడితే మన అడు గులు ఎటువైపు ఉంటాయో అంచనా వేసుకోవడం వల్లనే చైనా అతిగా స్పందించి ఉండొచ్చు.



వాస్తవానికి భారత్‌–చైనాల మధ్య వాణిజ్యం సంబంధాలు బాగానే ఉన్నాయి. నిరుడు అది 6,500 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది రాగలకాలంలో 10,000 కోట్ల డాలర్లకు పెంచాలన్నది లక్ష్యం. అంటే చైనా ఆర్థిక వ్యవస్థ కళకళలాడటంలో మన వంతు భాగం కూడా ఉంది. అటు పాకిస్తాన్‌తో ఆ దేశం చేసే వాణిజ్యం దాదాపు 1,100 కోట్ల డాలర్లు. అయినా చైనా ఆ దేశానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. పాకిస్తాన్‌ భూభాగం మీదుగా చైనా నిర్మించబోయే ఆర్థిక కారిడార్‌లో ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలోని గిల్గిత్, బాలిస్తాన్‌లున్నాయని మన దేశం చెప్పిన అభ్యంతరాలను అది బేఖాతరు చేసింది.



బ్రెగ్జిట్‌ అనంతర పరిణామాల నేపథ్యంలో యూరప్‌ యూనియన్‌ అనిశ్చితిలో పడటం, విశాల పసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం(టీపీపీ) నుంచి అమెరికా వైదొలగుతున్నట్టు ప్రకటించడం లాంటి పరిణామాలతో ఆస్ట్రేలియా, బ్రూనే, కెనడా, మలేసియా, సింగపూర్‌ వంటి దేశాలు చైనా వైపు చూడటం మొదలుపెట్టాయి. సహజంగానే ఈ పరిణామాలన్నీ తనకు అనుకూలంగా మారతాయని... ఆసియా ప్రాంతంలోనూ, ప్రపంచ వేదికల్లోనూ తన పలుకుబడి పెరుగుతుందని ఆ దేశం అంచనా వేస్తోంది. అందుకే కయ్యానికి కాలు దువ్వే రీతిలో చైనా ప్రకటనలున్నాయని భావించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అరుణాచల్‌ విషయంలో మన వైఖరిని దృఢంగా చెబుతూనే సరిహద్దు సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారానికే కట్టుబడి ఉన్నామని చాటవలసిన అవసరం ఉంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top