టీడీపీ మండలాధ్యక్షుడిపై కేసు
కొలిమిగుండ్ల: గొర్విమానుపల్లెకు చెందిన టీడీపీ మండలాధ్యక్షుడు మూలె రామేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పులిశేఖర్ ఆదివారం తెలిపారు. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి గొర్విమానుపల్లె సమీపంలోని 1221 సర్వే నెంబర్లో మైనింగ్ లీజుంది. ఈనెల 1న కంపెనీకి చెందిన స్థలం చుట్టూ సరిహద్దు ఫిల్లర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే సమయంలో రామేశ్వరరెడ్డి అక్రమంగా ప్రవేశించి ఇక్కడ తమకు స్థలం ఉందంటూ సరిహద్దు పిల్లర్లను పడగొట్టారు. అల్ట్రాటెక్ కంపెనీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కెస్కెఎన్ మూర్తి ఫిర్యాదు మేరకు మూలె రామేశ్వరరెడ్డి, మరో 20 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
అల్ట్రాటెక్ ప్రతినిధులపై కౌంటర్ కేసు..
అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఎంఎస్ఆర్కె ప్రసాద్తో పాటు మరో ఆరుగురిపై టీడీపీ మండలాధ్యక్షుడు మూలె రామేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ నెల 1న కంపెనీ ప్రతినిధులు తన పొలంలో గుంతలు తవివ్వ వ్యవసాయం చేసేందుకు వీలు లేకుండా చేశారంటూ రామేశ్వరెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. అల్ట్రాటెక్ కంపెనీ, రామేశ్వరరెడ్డి మధ్యనున్న వివాదస్పద భూమిని ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల సీఐ పీటీ కేశవరెడ్డి పరిశీలించారు.