ప్రజా విజయం


+ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బాటలో వైఎస్సార్‌సీపీ

+ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం

+ తెలుగుదేశం పార్టీని ఉతికి ఆరేసిన ఉపాధ్యాయులు

+ కత్తి విజయకేతనం




ప్రజాతీర్పు వైఎస్సార్‌సీపీని వరించింది. విద్యావంతులు, మేధావులు టీడీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రజా క్షేత్రంలో విజయం అసాధ్యమని రూఢీ చేశారు. కొనుగోలు చేసుకున్న విజయంతోనే సరిపెట్టుకోక తప్పదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీని ఉపాధ్యాయులు ఉతికి ఆరేశారు. అధికార టీడీపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించారు. టీడీపీ పెద్దలను గ్రాడ్యుయేట్స్‌ బట్టలూడదీసి వేలాడదీశారు.



సాక్షి ప్రతినిధి, కడప: శాసనమండలి స్థానిక సంస్థల కడప సీటును టీడీపీ కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలు..తెలుగు‘దేశం’లో అత్యంత ఖరీదైన ఎమ్మెల్సీగా కడప సీటు కీర్తి గడించనుంది. రూ.100 కోట్లు మంచినీళ్లు లెక్కన ఖర్చు చేయడంతో ఇది సాధ్యమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయిని బట్టి రేటు నిర్ణయించారు. ఒక్కో ఓటుకు రూ.25 లక్షలు చెల్లించి కడపలో గెలిచాం అన్పించేందుకు తాపత్రయం చూపారు. డబ్బున్నోడిదే గెలుపుగా ధ్రువీకరించారు. ఆపై టీడీపీ నేతలంతా ముక్తకంఠంతో విజయం సాధించామని గెంతులేశారు. వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ‘పబ్లిక్‌ విక్టరీ’ చేజారింది. ‘పర్చేజ్‌ విక్టరీ’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.



ప్రభుత్వానికి ఉపాధ్యాయుల చెంపపెట్టు: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ బచ్చల పుల్లయ్యను బరిలో దించింది. ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి పోటీచేశారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి సైతం పోటీలో ఉన్నారు. అధికార పార్టీలకు చెందిన అటు ఒంటేరు, ఇటు బచ్చల పుల్లయ్య ఉపాధ్యాయులను డబ్బుతో ఆకర్షించే ఎత్తుగడలకు పాల్పడ్డారు. కత్తి నరసింహారెడ్డి టీచర్లతో సమావేశం నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యమాలతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కత్తి నరసింహారెడ్డి పేరుతో ఉన్న మరో (డమ్మీ) వ్యక్తిని సైతం పోటీలో నిలిపారు. ఓవైపు డబ్బులు, మరోవైపు కుయుక్తులను ఉపాధ్యాయులు పసిగట్టారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో తీర్పు చెప్పారు. కత్తి నరసింహారెడ్డికి 9,624 ఓట్లు లభించగా, ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 5,861 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య ద్వితీయ ప్రాధాన్యత ఓటు నుంచి ఎలిమినేట్‌ కావాలి్సన పరిస్థితి నెలకొంది. 18,840 ఓట్ల తీర్పులో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కడప, అనంతపురం, కర్నూల్‌ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీని తిరస్కరిస్తూ తీర్పు చెప్పారు.



ఓటుతో బుద్ధి చెప్పిన విద్యావంతులు: తెలుగుదేశం పార్టీ చీప్‌ట్రిక్స్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పారలేదు. విద్యావంతులు ప్రభుత్వ పెద్దలకు ఓటుతో బుద్ధి చెప్పారు. కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలలోని మేధావులు టీడీపీని తిరస్కరించారు. 1,55,711 ఓట్లు పోల్‌ అయ్యాయి. వాటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేజే జెరెడ్డికి కేవలం 41,037 ఓట్లు మాత్రమే లభించాయి. పోటీచేసిన అభ్యర్థుల్లో అత్యధికంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాలరెడ్డికి 53,734 ఓట్లు దక్కాయి. పీడీఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ గేయానంద్‌కు 32,810 ఓట్లు దక్కాయి. 18,363 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపొందాలంటే 67,887 ఓట్లు లభించాల్సి ఉంది. దాంతో ద్వితీయ ప్రాధాన్యత ఓటు కౌంటింగ్‌ ప్రా రంభించారు. కాగా తెలుగుదేశం పార్టీ అ భ్యర్థి కంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 12,694 ఓట్ల ఆధిక్యత సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓటు తొలిరౌండ్‌ ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ ఆధిక్యత 14వేలు దాటింది. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి అడుగులు విజయం దిశగా పడ్డాయి. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి పరాజయం బాటలో పయనించక తప్పలేదు. తెలుగుదేశం పార్టీని విద్యావంతులు, మేధావులు, ఉ పాధ్యాయులు గట్టిగా తిరస్కరించారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. స్థానిక సంస్థ ల ఎన్నికల్లో 839 ఓట్లు కాబట్టి పెద్ద ఎత్తు న ప్రలోభాలకు గురిచేశారని, ప్రజలు, మే ధావులు, విద్యావంతుల్లో టీడీపీ పరువు నిలుపుకునే పరిస్థితి కూడా లేకపోయిం దని పలువురు విశ్లేషిస్తున్నారు. ‘పబ్లిక్‌ విక్టరీ(ప్రజా విజయం)’ వైఎస్సార్‌సీపీ సొంతం కాగా, ‘పర్చేజ్‌ విక్టరీ’(కొనుగోలు చేసిన విజయం) టీడీపీ సొంతమైందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top