'ఒక్కో కుటుంబానికి కనీసం రూ.5 వేలు ఇవ్వాలి'
నెల్లూరు: వరద బాధితులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వరదలకు గ్రామాలకు గ్రామాలు నీట మునిగిపోతే, ఏ ఒక్కరికి చంద్రబాబు సర్కార్ సాయం చేయలేదని మండిపడ్డారు. నిత్యావసర వస్తువులు, పనులు దొరక్క బాధితులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబాలకు కనీసం రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిధులివ్వకుండా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను తిడితే ఏం ప్రయోజనమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. వరద బాధితుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు.