బిల్లులను ప్రవేశపెట్టిన వెంటనే చర్చించమంటే ఎలా?
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగకుండా అధికారపక్షం అడ్డుకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. సభలో పెట్టే బిల్లుల కోసం వారం ముందు సమాచారం ఇవ్వాలన్న నిబంధన ఉన్నా.. అలా చేయకుండా బిల్లులను అప్పటికప్పుడు ప్రవేశపెట్టి.. వెంటనే చర్చించమంటే ఎలా అని రోజా ప్రశ్నించారు.
బిల్లుల కోసం వారం ముందు సమాచారం ఇవ్వాలన్న అంశాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేవనెత్తితే దాన్ని పరిగణలోకి తీసుకోపోవడం దారుణమన్నారు. తొమ్మిది బిల్లులను సభలో ప్రవేశపెట్టిన వెంటనే చర్చించమనడం అధికారపక్షానికి తగదని సూచించారు. సభలో నిరసన తెలపడం, వాకౌట్ చేయడం ప్రతిపక్షంగా తమ హక్కు అని ఆమె తెలిపారు. వాకౌట్ చేయడానికి కూడా మైక్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా బిల్లులపై చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు ఇలాగే వ్యవహరించారా?అని రోజా నిలదీశారు. సమగ్రమైన చర్చ జరగకుండా బిల్లును పాస్ చేసుకోవడం కోసం అధికారపక్షం సభను బుల్డోజ్ చేస్తోందని రోజా విమర్శించారు.