'యనమలకు ఆ దమ్ము, సత్తా లేవు'
హైదరాబాద్: అసలు, వడ్డీలతో సహా రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ డబ్బులు ఇవ్వకుండా నామమాత్రంగా ఏడు వేల కోట్లు మాత్రమే ఇచ్చారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. అవి వడ్డీలకు కూడా చాలకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని మండిపడ్డారు.
కరువు సాయం కోసం కేంద్రం నుంచి సాయం కూడా సరిపడ తెచ్చుకోలేక పోవడం సిగ్గు చేటన్నారు. ఎప్పుడు చూసినా తాను మేధావినని చెప్పుకొనే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వెటకారంగా సమాధానాలు ఇచ్చారే తప్పా.. కనీసం కేంద్రం నుంచి నిధులను తెచ్చుకునే దమ్ము, సత్తా కూడా లేదనే సంగతిని తెలుసుకోవాలన్నారు.
ఏపీ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ.. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి చేసి రైతులకు సాయం చేయాలి. దాన్ని పక్కన పెట్టి అసెంబ్లీలో ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. జీవో నెంబర్ 690లో లక్షన్నర మాత్రమే ఇవ్వాలని చెప్పారు. అంటే ఈ రైతులు మనుషులు కారా?. వీళ్లకు ఐదు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదా?అని రోజా ప్రశ్నించారు.