తాగునీరు సరఫరాలో ప్రభుత్వం విఫలం
శ్రీకాకుళం: ప్రజలకు తాగునీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. కవిటిలోని పార్టీ కార్యాలయంలో కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం రూరల్ మండలాల ప్రతినిధులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పల్లెప్రజలకు గుక్కెడు నీటిని అందించకుండా పాలకులు కాలక్షేపం చేస్తున్నారన్నారు.
పార్టీ అధిష్టానం పిలుపుమేరకు అన్ని మండల కేంద్రాల్లో ఖాళీ బిందెలతో సోమవారం ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. తాగునీరు అందించని ప్రభుత్వం రూ.3కోట్లతో మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేస్తోందంటూ గ్లోబల్ ప్రచారానికి తెరతీసిందన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఖర్చులో తప్పుడు లెక్కలు చూపిస్తూ అధికార పార్టీ నేతలు కాజేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు, సత్యనారాయణపాఢి, పి.ఎం.తిలక్, కంచిలి ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, మండల కన్వీనర్లు కడియాల ప్రకాష్, పి.ఆనంద్కుమార్, ఆర్.చిట్టిబాబు, సీతారాం, పి.శ్రీరాములు, మద్దిలి ఈశ్వరరావు, దుర్గాశి ధర్మారావు, వెంకటరావు, నీలాచలం, లచ్చయ్య పాల్గొన్నారు.