'మీవే దండయాత్రలు.. జనాలకు ఏం చెప్తారు?'
హైదరాబాద్: టీడీపీ మంగళవారం చేపట్టిన జనచైతన్య యాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ చేసేది జన చైతన్య యాత్ర కాదని ప్రజలపై చేస్తున్న దండయాత్ర అని అన్నారు. అది ముమ్మాటికి జన చైతన్య యాత్ర అనిపించుకోదని కచ్చితంగా జనదోపిడి యాత్ర అని అన్నారు. ఎప్పుడు ఎలా దోచుకోవాలనే కార్యక్రమాలతో ఏపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ముందుకు వెళుతోందని ఆరోపించారు.
అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని, అలా ఇవ్వకుంటే నెలకు రూ.రెండు వేలు ఇస్తామని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయారని గుర్తు చేశారు. ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన బాబు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ భర్తీ చేయలేదని, ఇటీవలె తనకు నచ్చిన వ్యక్తిని చైర్మన్ గా నియమించుకున్నాడని ఆరోపించారు. జన చైతన్య యాత్రలో ఏం చెప్పాలనుకుంటున్నారని నిలదీశారు. జనాల్ని చైతన్యం చేయడం కాదని ముందు చంద్రబాబు ఆయన బృందం చైతన్యం కావాలని సూచించారు. రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయలేకపోయారని చెప్పారు. అందుకే ఈ వైఫల్యాలన్ని నిలదీస్తూ తాము ప్రజాబ్యాలెట్ ప్రచురించామని అంబటి చెప్పారు.