మరో డ్రామానే ‘చంద్రన్న బాట’
అనంతపురం న్యూసిటీ : గిరిజనులకు గుప్పించిన హామీల్లో ఒక్క దాన్ని కూడా నెరవేర్చకుండానే ముఖ్యమంత్రి చంద్రన్న బాట పేరిట మరో డ్రామాకు తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాం నాయక్ విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గిరిజనాభివద్ధికి చర్యలు తీసుకున్నామని పాలకులు గొప్ప చెబుతున్నారు. కానీ ఒక్క గిరిజనునికైనా లబ్ది చేకూర్చిన దాఖలాల్లేవు. ఉపాధి లేకపోవడంతో వారు ముంబయ్, కేరళ, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు’ అని విచారం వ్యక్తం చేశారు.
ప్రతి గిరిజన కుటుంబానికీ మూడెకరాల భూమి ఇస్తామని, ఆడపిల్లలకు ఒక్కొక్కరికి రూ.50వేలు అందజేస్తామని, 500 జనాభా కలిగిన గ్రామాన్ని పంచాయతీగా మారుస్తామని, బ్యాంకు లింకేజీ లేకుండా రుణాలు మంజూరు చేస్తామని, గిరిజన భవన్ను నిర్మిస్తామని హామీలు గుప్పించిన ప్రభుత్వం ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శులు సాకే చిరంజీవి, గుజ్జల శివయ్య, నగరాధ్యక్షులు దేవరకొండ సుబ్బరాయుడు, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.