నంద్యాలలో ఆ హోటల్ కేంద్రంగా..
నంద్యాల: ఉప ఎన్నిక పోలింగ్ దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ నాయకులు ప్రలోభాల పర్వంలో దూకుడు పెంచారు. గుట్టుచప్పుడుకాకుండా డబ్బులు వెదజల్లుతున్నారు. నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ కేంద్రంగా టీడీపీ నాయకులు పంపకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. నెల రోజులుగా ఈ హోటల్లో అధికార పార్టీ నేతలు మకాం వేశారు.
ఈ హోటల్ను వేదికగా చేసుకుని 20 రోజులుగా మంత్రులు పన్నాగాలు సాగిస్తున్నారు. స్థానిక నేతలను హోటల్కు పిలిపించుకుని డబ్బులు ముట్టజెబుతున్నట్టు సమాచారం. బూత్కు రూ. 5 లక్షల చొప్పున పంచేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఇంతవరకు ఈ హోటల్వైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
మరోవైపు అధికార పార్టీ నేతలు పోలీసులను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పుతున్నారు. దీంతో తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకునియ పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. అధికార పార్టీ నేతలపై నిఘా పెంచాలని కోరుతోంది.
టీడీపీ ప్రలోభాల పర్వంపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఆ పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. నూనెపల్లిలో కో-ఆపరేటివ్ బ్యాంకు వద్ద టీడీపీ నేతలు మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. 33వ వార్డులో పోలీసుల భద్రత నడుమే టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ కనబడ్డారు.