తుప్పుపట్టిన సీఎం హామీలు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి
వనపర్తి రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలు నెరవేరకుండా తుక్కుపట్టిపోతున్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటైతే తొలి సీఎంగా దళితుడ్ని చేస్తానని, కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుపేదలకు మూడెకరాల భూ పంపిణీ తదితర హామీలు నెరవేరలేదన్నారు. ఆదివారం స్థానిక పీఆర్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్బెడ్ రూం హామీ ఇప్పటి వరకు జిల్లాలో కార్యరూపం దాల్చలేదని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
గతంలో వైఎస్ఆర్ పథకాలకే పేరు మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కేవలం కమీషన్ల కోసమే పాలమూరు ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రానున్న 2019 ఎన్నికల వరకు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి టీఆర్ఎస్కు బలమైన ప్రత్యర్థిగా నిలబెడుతామన్నారు. అనంతరం అధ్యక్షుడిగా పదవి చేపట్టాక మొదటిసారి వనపర్తికి వచ్చిన భగవంతురెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జ ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదిర్శ రాజశేఖర్, మక్తల్ బాధ్యులు గంగాధర్, భాస్కర్, బుడ్డన్న, వివిధ మండలాల నాయకులు దేవాచారి, రాజశేఖర్, కృష్ణ, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.