1,2 తేదీల్లో గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల 1, 2 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన విలీన మండలాల్లో పర్యటించనున్నారని పార్టీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సోమవారమిక్కడ తెలిపారు. ముందుగా వైఎస్ జనగ్ జూలై 1న పశ్చిమగోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో పర్యటిస్తారు. పోలవరం ముంపు ప్రాంతాల్లోని ప్రజలతో సమావేశమై ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం వైఎస్ జగన్ రాత్రికి భద్రాచలం చేరుకొంటారు.
జూలై 2న వైఎస్ జగన్ ఎటపాక మండలం మీదుగా కూనవరం చేరుకొని అక్కడి నుంచి రేఖపల్లిలో నిర్వాసిత రైతులతో మాట్లాడతారు. అనంతరం రేఖపల్లి చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల మీద ఎమ్మెల్యే రాజేశ్వరి వీఆర్పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల్లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో రేఖపల్లిలో సమావేశం నిర్వహించారు.