నేటి నుంచి ‘అనంత’లో రైతు భరోసా యాత్ర
తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పంటలు పండక, అప్పుల ఊబిలో కూరుకుపోయి, సర్కారు చేయూత లేక అనంతపురం జిల్లాలో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ జిల్లాలో 145 మంది రైతులు, 26 మంది చేనేత కార్మికులు తనువు చాలించారు. కష్టాల్లోనే కడతేరుతున్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
ఈ నేపథ్యంలో నేనున్నానంటూ అన్నదాతల్లో భరోసా కల్పించేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుం బిగించారు. ై‘రెతు భరోసా యాత్ర’ పేరుతో ఇప్పటికే అనంతపురం జిల్లాలో నాలుగు విడతల్లో పర్యటించారు. 12 నియోజకవర్గాల్లో 70 రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. బుధవారం నుంచి ఐదో విడత భరోసా యాత్ర నిర్వహించనున్నారు. తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తొలి రోజున మూడు కుటుంబాలను పరామర్శించనున్నారు.