ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం: వైఎస్ జగన్


ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దువ్వ, వరిఘేడులలో పంటపొలాలను ఆయన పరిశీలించారు.



ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా పంట నష్టపోయిన రైతులు తమ కష్టాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వర్షాలతో రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో ఈ సమస్యలను ప్రస్తావించి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.


తణుకులో వీఆర్ఏలు నిర్వహిస్తున్న దీక్షకు వైఎస్ జగన్ సంఘీభావం తెలిపారు. నేరుగా ఎంపికైన వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ కు వినతిపత్రం సమర్పించారు. వీఆర్ఏలతో పాటు అంగన్ వాడీల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.


వైఎస్ జగన్ అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం జిల్లాకు రాకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top