ఆ జీవోలో ఎక్కడైనా ఉందా?

ఆ జీవోలో ఎక్కడైనా ఉందా? - Sakshi


హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ రైతుల కష్టాలు తీరుతాయని పదే పదే చెబుతున్న ఏపీ ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టు జీవోలో రాయలసీమకు నీటి తరలింపు అంశాన్ని ఎక్కడా కూడా పేర్కొనని ప్రభుత్వం.. అసలు నీటిని ఎలా తరలిస్తుందనే దానికి ముందు సమాధానం చెప్పాలన్నారు. పట్టిసీమ కోసం పోలవరం ప్రాజెక్టుని గాలికి వదిలేశారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టే నిధులతో హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తవుతాయనే సంగతిని ప్రభుత్వం గుర్తించాలన్నారు.


 


ఏపీ శాసనసభలో ప్రభుత్వ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరిని వైఎస్ జగన్ తప్పుబట్టారు.  దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కరువు, నీటి ప్రాజెక్టులు అనే రెండూ వేర్వేరు అంశాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పడం నిజంగా సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం, స్పీకర్ కలిసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.


 


పట్టిసీమ ప్రాజెక్టుపై చంద్రబాబు పదే పదే అబద్ధాలు చెబుతున్నారన్నారు. పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం రెండు జీవోలు విడుదల చేయడానికి గల కారణాలు ఏమిటని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న అనంతపురం జిల్లాలో తాను పరామర్శయాత్ర చేయడం వల్లే.. ఆ రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top