‘హైదరాబాద్కు బదులు హోదా ఇస్తామన్నారు'

‘హైదరాబాద్కు బదులు హోదా ఇస్తామన్నారు' - Sakshi


కర్నూలు : ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్రాలు ఆడుతున్న కపట నాటకాలపై యువతను చైతన్యపరిచేందుకు వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం కర్నూలులో విద్యార్థులు, యువతతో భేటీ  అయ్యారు.


గుత్తి జాతీయ రహదారిలోని వీజేఆర్ ఫంక్షన్ హాలులో జరుగుతున్న యువభేరీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘ఇవాళ యువభేరి కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ ఆదరణ, ఆప్యాయతలకు చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.  ప్రత్యేక హోదాకు సంబంధించి యువభేరి కార్యక్రమంలో ఒకటయ్యాం. హోదా వల్ల అవసరాలు ఏంటీ... ఎందుకు కావాలి. ఏ రకంగా ఇది సంజీవని అనేది మనకు తెలిసిన విషయలే. హోదా అనేది సంజీవని అని, హోదా ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు పాలకులు పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ తర్వాతే రాష్ట్రాన్ని విడగొట్టారు.



ఇవాళ ఏ పిల్లాడు అయినా చదువు అయిన తర్వాత నేరుగా హైదరాబాద్ వెళతాడు... కారణం ఏంటంటే ఇవాళ దాదాపు 98 శాతం సాప్ట్వేర్ ఉద్యోగాలు అక్కడే ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్...తదితర సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజనతో  హైదరాబాద్ నగరం లేకుండా పోతుందని, దాని స్థానంలో ప్రత్యేక హోదా ఇస్తామని, ఆ హోదా వల్ల ఏపీ కూడా బాగుపడుతుంది, ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని అధికార, ప్రతిపక్ష పాలకులు అన్నారు.



ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు హామీ ఇచ్చారు. ఒకరేమో పదేళ్లే అంటే ...మరొకరేమో పరిశ్రమలు పెట్టడానికి మూడేళ్లు పడుతుంది కాబట్టి పదేళ్లు కాదు ...ఏకంగా 15 ఏళ్లు కావాలన్నారని  వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇవాళ అదే నాయకులు ప్లేట్ మార్చారు. హోదాకు ఉద్యోగాలకు సంబంధం లేదని చెబుతున్నారని ఆయన అన్నారు. మాట తప్పిన నేతలను గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత ముఖ్యమన్నారు. ఎన్నాళ్లు బతికామనేది కాదని, ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు. మోసం చేసినా కాలర్ పట్టుకుని అడిగే పరిస్థితి లేకపోవడం బాధకరమని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు.


వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే...


  • రైతుల ఓట్ల కోసం రుణమాపీ చేస్తామన్నారు

  • మహిళల ఓట్ల కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు

  • జాబు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పిల్లలను వదిలిపెట్టలేదు..

  • బాబు ముఖ్యమంత్రి అయ్యారు...అందరినీ గాలికొదిలేశారు

  • హోదా వస్తే కేంద్రం నుంచి 90 శాతం నిధులు గ్రాంట్ గా వస్తాయి

  • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు ఇస్తారు

  • చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 16 సార్లు విదేశాలకు వెళ్లారు

  • పారిశ్రామిక రాయితీలు ఇస్తే బాబు విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు

  • హోదా వస్తే ఎక్సైజ్ డ్యూటీ, ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు

  • హోదా కోసం అవసరం అయితే ఎంపీలతో కూడా రాజీనామాలు చేయిస్తాం

  • ప్రత్యేక హోదా వచ్చేవరకూ నిరంతర పోరు
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top