ప్రత్యేక హోదాతో లాభాలివే: వైఎస్ జగన్
హైదరాబాద్ : ప్రత్యేక హోదా వేరు, ప్రత్యేక ప్రోత్సహకం వేరన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటనే విషయాన్ని వైఎస్ జగన్ సోదాహరణంగా అసెంబ్లీలో వివరించారు. ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్ ఎలా లబ్ది పొందిందో వివరణ ఇచ్చారు.
ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఇష్టాయిష్టాల ప్రకారం నిధులందుతాయని వైఎస్ జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఫాలో అప్ చేయలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు ప్రణాళిక సంఘం రద్దు అయిందని అంటున్నారని, కాని ప్రణాళిక సంఘం దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేఖ ఏడు నెలలుగా మగ్గిపోయిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ముఖ్యమంత్రి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. పొరుగు రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయని, ఫైనాన్స్ కమిషన్ వద్దని చెప్తుండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వస్తాయని, వేల కోట్ల రూపాయల పెట్టుబడుల రాకతో అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం తానేం చేయబోతున్నారో గంటన్నర ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా చెప్పలేదని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిపక్షమైన తమపై అనవసరంగా అభాండాలు వేశారని గుర్తు చేశారు. పార్లమెంట్లో ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారన్న చంద్రబాబు ఆరోపణలను జగన్ ఖండించారు. ముఖ్యమంత్రి ప్రసంగమంతా అర్థసత్యాలు, అభాండలుగా సాగిందని అన్నారు.
* ప్రత్యేక హోదాతో కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంటులు వస్తాయి
* ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ సమానం కాదు.. రెండూ వేర్వేరు అంశాలు
* 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో ఉన్నాయి. వీటికి ఆదాయ, కస్టమ్స్ సుంకాలు వంద శాతం మినహాయింపు
* అటువంటి ప్రయోజనాలు వేరే ఏ రాష్ట్రానికైనా ఉన్నాయా అని అడుగుతున్నా
* రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఏఐబీపీ నిధుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు 90 శాతం గ్రాంటుగా వస్తుంది
* ప్రత్యేక హోదా లేకపోతే 70 శాతం రుణంగా వస్తుంది
* ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి కేంద్రం ఎన్ని డబ్బులు ఇవ్వాలనే దానికి ఫార్ములా అంటూ ఏమీ లేదు
* ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ జమ్మూకశ్మీర్ రూ.70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు
* నరేంద్ర మోదీ దయ తలిస్తే ఎంత ప్యాకేజీ అయిన వస్తుందనడానికి ఇదే నిదర్శనం
* కోటిన్నర జనాభా ఉన్న కశ్మీర్ కు అంత ప్యాకేజీ ఇస్తే 5 కోట్ల జనాభా ఉన్న ఏపీకి ఎంత ఇవ్వాలి