జనం చెవిలో పువ్వులు పెడుతున్నారు

జనం చెవిలో పువ్వులు పెడుతున్నారు - Sakshi


వరదలొచ్చాక కరువు మండలాలు ప్రకటిస్తే ఎలా

ఇళ్లు కట్టించకుండా కూల్చేస్తే ఊరుకునేది లేదు

నెల్లూరు పర్యటనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన అంతా మోసం.. మోసం.. మోసం అన్న మూడు పదాల చుట్టూనే తిరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా గురువారం నెల్లూరు నగరంలో పర్యటించారు. స్థానికుల కోరిక మేరకు మన్సూర్‌నగర్‌లో ప్రసంగించారు. ''చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఇంటింటికో ఉద్యోగం అన్నారు. రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు రూ.1,690 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక ఇవ్వను పో అని మోసం చేశారు. ఉద్యోగం మోసం.. నిరుద్యోగభృతి మోసం... రుణాల మాఫీ మోసం... ఇన్‌పుట్ సబ్సిడీ మోసం... చంద్రబాబు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారు'' అని ధ్వజమెత్తారు.



కరువు మండలాలను వరదలొచ్చాక ప్రకటించారని ఆరోపించారు. మొదట్లో 196 మండలాలను ప్రకటించారని, తర్వాత మొన్నటికి మొన్న మరో 163 మండలాలను ప్రకటించారన్నారు. వరదలొచ్చాక కరువు మండలాలను ప్రకటించటం వల్ల అధికారులు ఎన్యుమరేషన్‌కు వెళితే ఫలితాలు ఎలా అనుకూలంగా వస్తాయని ప్రశ్నించారు.



వారి జోలికొస్తే ఊరుకోం

ఇళ్లు కట్టించకుండా పేదల ఇళ్ల జోలికొస్తే ఊరుకునేది లేదని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మన్సూర్‌నగర్‌లో సుమారు 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నవారి నివాసాలను కూల్చేస్తామనటం అన్యాయమన్నారు. కాలనీవాసులది దురాశైతే.. విజయవాడలో నదీతీరాన చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చా? అని ప్రశ్నించారు. నెల్లూరు మునిగిపోవటానికి ఆక్రమణలే కారణమంటూ పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా తొలగించడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇళ్లు తొలగించాలంటే వారికి పక్కాగృహాలు కట్టించాలి, లేకపోతే మార్కెట్ ధర ప్రకారం వారికి పరిహారం ఇవ్వాలి, అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తే పేదల తరఫున వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటుందని హెచ్చరించారు. నగరంలో పంట కాలువలన్నింటినీ ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపారని, వారి జోలికి వెళ్లకుండా పేదల జోలికి వెళ్లటం అన్యాయమన్నారు.



రూ.5వేల చొప్పున తక్షణ సాయం ఇవ్వాలి

నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, ఉభయగోదావరి జిల్లాల్లో వరదలకు నష్టపోయి నిరాశ్రయులైన వారికి తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరదల వల్ల ఇళ్లు పోగొట్టుకుని పది రోజులుగా నీళ్లలో నానుతున్నవారికి ప్రస్తుతం ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కొందరికి బియ్యం ఇచ్చి, మరికొందరికి ఇవ్వకపోవటం.. ఇంకొందరికి తక్కువగా ఇచ్చి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరూ ఊహించని విధంగా ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయని, అన్నీ తెలిసి చంద్రబాబు బాధితులకు తక్షణ సాయం చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను గుర్తించటంలోనూ అన్యాయం చేస్తున్నారని, నామమాత్రపు సర్వేలు చేయిస్తున్నారని ప్రభుత్వంపై జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.



కాగా వైఎస్ జగన్ గత మూడు రోజులుగా చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తొలుత 23, 24 తేదీల్లోనే పర్యటన ఉంటుందని భావించినా, వరద నష్టం తీవ్రంగా ఉన్నందున మరో రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో పర్యటనను వైఎస్ జగన్ పొడిగించారు. గురువారం రాత్రికి ఆయన నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తిరిగివస్తారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు వెళతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్న ప్రాంతాల్ని సందర్శించి ప్రత్యక్షంగా పంటనష్టం వివరాల్ని, ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుంటారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top