యువతిని వేధించిన యువకులపై నిర్భయ కేసు


తిరుపతి : ప్రేమ పేరుతో వేధించి, యువతిని తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు యువకులపై చిత్తూరు జిల్లా తిరుపతిలోని అలిపిరి పోలీసులు మంగళవారం నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. (చదవండి... తిరుపతిలో మృగాళ్ల అకృత్యం) అలిపిరి సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. నగరంలోని కేపీ లేఅవుట్‌లో నివాసముంటున్న విద్యార్థినిని గతంలో ఆమెతో పాటు చదువుకున్న నవీన్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు.


అతని ప్రేమను విద్యార్థిని అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్న నవీన్‌ తన స్నేహితుడు యశ్వంత్‌తో కలిసి జూన్‌ 1న మద్యం తాగి..ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని, ఆమె స్నేహితురాలిని బైక్‌తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


నవీన్‌ ముందస్తు ప్రణాళికతోనే వాహనాన్ని ఢీకొట్టాడని దర్యాప్తులో తేలడంతో కేసును అలిపిరి పోలీసు స్టేషనుకు బదిలీ చేశారు. వెన్నెముకకు తీవ్ర గాయమవడంతో బాధితురాలు మంచానికే పరిమితమైంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top