కాలువలో యువకుడి గల్లంతు
శంఖవరం: వేసవి తాపం భరించలేక కాలువలో స్నానానికి దిగిన యువకుడు గల్లంతైన సంఘటన కొంతంగి శివారు కొత్తూరు సమీపంలో బుధవారం జరిగింది. నెల్లిపూడి గ్రామానికి చెందిన గోళ్ల వీరబాబు(20) తన స్నేహితులతో కలసి ఏలేరు కాలువ సమీపంలోని పొలంలోకి వెళ్లాడు. మధ్యాహ్నం వేసవి తాపం తీర్చుకునేందుకు స్నేహితులతో కలసి ఏలేరు ఎడమకాలువలో స్నానానికి దిగాడు. స్నానం ముగిశాక వీరబాబు కనిపించలేదు. స్నేహితులు కాలువలో గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. గ్రామస్తులు జి.కొత్తపల్లి వద్ద కాలువలో ప్రవాహానికి అడ్డుగా కర్రలు పాతి, గాలింపు ముమ్మరం చేశారు. ఈ సంఘటనతో నెల్లిపూడిలో విషాదఛాయలు అలముకున్నాయి.