ప్రేమించకుంటే..చంపేస్తానన్నాడు..


బొమ్మలరామారం: ‘ప్రేమిస్తున్నా... పెళ్లికి ఓకే చెప్పకుంటే చంపేస్తా...’నని బెదిరిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం రాంలిగంపల్లిలో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని రాంలింగంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి తన అమ్మమ్మ గారి ఊరైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో చదువుకునే క్రమంలో గత కొంత కాలంగా అక్కడే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన గుర్రం కర్ణాకర్ బాధితురాలికి ట్యూషన్‌చేప్పేవాడు. ఆ సమయంలో సాన్నిహిత్యం పెంచుకున్న కర్ణాకర్ ప్రేమ పేరుతో వేధిండం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువతిని స్వగ్రామమైన రాంలింగంపల్లికి తీసుకువచ్చారు.


 


ఈ క్రమంలో గత నెల 29న రాంలింగంపల్లి గ్రామానికి కర్ణాకర్ వచ్చాడు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్ణాకర్ మద్యం తాగి వచ్చి, తనను పెళ్లి చేసుకోకుంటే చంపుతానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి యువతి శనివారం ఫిర్యాదు చేయడంతో కర్ణాకర్‌పై నిర్భయ కేసు నమోదు చేశారు. కాగా, గత నెల 29న రాంలిగంపల్లిలో టీకొట్టు దగ్గర ఉండగా యువతి బంధువులు తనపై దాడి చేసి గాయపరిచారని కర్ణాకర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top