ట్రాక్టరు ఢీకొని యువకుని మృతి
కాశీబుగ్గ(పలాస) : అతి వేగంతో వెనుక నుంచి వస్తున్న ట్రాక్టరు ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయిన యువకుని పైనుంచి ట్రాక్టరు వెళ్లడంతో ఆ యువకుడు అక్కడికక్కడే బుధవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..పలాస మండలం అల్లుకోల గ్రామానికి చెందిన దువ్వాడ మురళి(36)అలియాస్ పండు తన గ్రామం నుంచి రెంటికోట రోడ్డులో పలాస వైపు వస్తుండగా కొత్తవూరు బస్టాండ్ దాటాక చిన్న వంతెన సమీపంలో వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. దీంతో మురళి కింద పడిపోగా ఆయన పైనుంచి ట్రాక్టర్ తొట్టె వెళ్లిపోగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మురళి మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, తోటి ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఏఎస్ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి తల్లి తవిటమ్మ ఉంది.