యువరైతు ఆత్మహత్య
కుల్కచర్ల (రంగారెడ్డి) : గత ఆరేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న మామిడితోట నీళ్లు లేక ఎండిపోవడంతో.. మనస్తాపానికి గురైన యువ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోట ఎండిపోవడంతో పాటు నెల రోజుల క్రితం లక్ష రూపాయలు అప్పు చేసి కొన్న జెర్సీ ఆవు మృతి చెందడం, ఉన్న రెండు బోర్లు ఎండిపోవడంతో.. చేసిన అప్పులు తీర్చే దారి కానరాక పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంఘటన కుల్కచర్ల మండలం పుట్టపహడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటయ్య(33) తనకు ఉన్న 3 ఎకరాల పొలంలో 6 సంవత్సరాల క్రితం రెండు ఎకరాల మామిడి తోట వేశాడు. తోట కోసం వేసిన రెండు బోర్లు ఎండిపోవడంతో పాటు తోట ఎండిపోతుండటం.. దీనికి తోడు జర్సీ ఆవు మృతిచెందడంతో చేసిన అప్పులు తీర్చే దారి కానరాక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.