‘అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసులు’


యల్లనూరు : శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారని యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణ మండిపడ్డారు. గొడ్డుమర్రి ఈశ్వర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యల్లనూరు మండల వ్యాప్తంగా జరుగుతున్న గ్యాంబ్లింగ్, మట్కా, జూదం, విచ్చలవిడి మద్యం అమ్మకాలు జరుగుతున్నా పోలీసులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇందుకు కారణం ఆ అసాంఘిక కార్యకలాపాల వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉండటమేనని ఆరోపించారు.



బొప్పేపల్లికి చెందిన కాంట్రాక్టర్‌ రామాంజులరెడ్డిపై అదే గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు చింతా రవికుమార్‌రెడ్డి, వాసాపురం నరేంద్ర నాయుడు, వారి అనుచరులు హత్యకు కుట్రపన్నారన్నారు. పోలీసుల ఎదుట వారు ఒప్పుకున్నా.. ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ వారి నుంచి ఎలాంటి హాని జరిగినా ఇందుకు పోలీసులే బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top